కంగనా సినిమాకు అక్కడా షాకే

క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, మణికర్ణిక లాంటి చిత్రాలతో ఒకప్పుడు వైభవం చూసింది కంగనా రనౌత్. బాలీవుడ్ చరిత్రలోనే కథానాయికగా ఎవరూ అందుకోని క్రేజ్, మార్కెట్‌ను ఆమె సొంతం చేసుకుంది. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని మాత్రం ఆమె మరిచిపోయింది. తలబిరుసుతో ఆమె వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు, పదే పదే వివాదాల్లో జోక్యం చేసుకోవడం కంగనా కెరీర్‌ను పరోక్షంగా గట్టి దెబ్బే తీశాయి. దీంతో ఈ మధ్య కంగనా సినిమాలను జనం పట్టించుకోవడం మానేశారు.

తన చివరి చిత్రం ‘ధకడ్’ పెట్టుబడి-రాబడి కోణంలో బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీని తర్వాత స్వీయ దర్శకత్వంలో చేసిన ‘ఎమర్జెన్సీ’ ఎంతకీ విడుదలకు నోచుకోవడం లేదు. అనేక వాయిదాల తర్వాత సెప్టెంబరు 6న రిలీజ్ చేద్దామని చూస్తే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు.

ఈ సినిమాకు వ్యతిరేకంగా పలువురు కోర్టులను ఆశ్రయించారు. విడుదల ఆపాలని శిరోమణి అకాలీదల్ పార్టీ సెన్సార్ బోర్డును కోరింది. వేరే అభ్యంతరాలు కూడా వ్యక్తం కావడంతో సెన్సార్ బోర్డు ఒక నిర్ణయం తీసుకోలేదు. ఐతే తన సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇప్పించాలని బొంబాయి హైకోర్టును కంగనా ఆశ్రయించింది. కానీ ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని తాము సెన్సార్ బోర్డును ఆదేశించలేమని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది.

ఐతే సెప్టెంబరు 18 లోపు ఈ విషయమై ఏదో ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. కంగనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తన సినిమాకు సెన్సార్ సమస్యలు ఎదురు కావడం, అక్కడి నుంచి క్లియరెన్స్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను కంగనా తెరకెక్కించింది. ఇది బీజేపీ ప్రాయోజిత ప్రాపగండా ఫిలిం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.