శ్రీవిష్ణు చేస్తున్నది పెద్ద సాహసమే

ఓం భీమ్ బుష్ లాంటి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు త్వరలో స్వాగ్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 విడుదల చేయబోతున్నట్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ సాహసం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే సెప్టెంబర్ 27 దేవర పార్ట్ 1 వచ్చిన వారానికే స్వాగ్ రంగంలోకి దిగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. సినిమా మీద నమ్మకంతో నిర్మాతలు ఏకంగా అర్ధరాత్రి ప్రీమియర్లకు ప్రయత్నిస్తున్నారంటే ఏ రేంజ్ అవుట్ ఫుట్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. హైప్ అలా ఉంది మరి.

అలాంటప్పుడు వారం గ్యాప్ అనేది ఒక రకంగా రిస్కే. ఒకవేళ దేవరకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కల్కి 2898 ఏడి లాగా కనీసం మూడు వారాల పాటు స్ట్రాంగ్ గా ఉంటుంది. థియేటర్లకు బలమైన ఫీడింగ్ లా నిలుస్తుంది. అలాంటప్పుడు స్వాగ్ కి స్క్రీన్లు సర్దుబాటు చేయడం కొంచెం ఇబ్బంది అవ్వొచ్చు. పైగా అటుపై అక్టోబర్ 11 ఇదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన గోపీచంద్ విశ్వం వచ్చేస్తోంది. ఈ కారణంగానే శ్రీవిష్ణు మూవీని త్వరగా తెచ్చే ఆలోచన చేసుండొచ్చు. రాజ రాజ చోర దర్శకుడు హసిత్ గోలి రూపొందించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ట్రైలర్ చూశాక అంచనాలైతే పెరిగాయి. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు పాత్రలు పోషిస్తున్న శ్రీవిష్ణు గెటప్స్ పరంగా కూడా చాలా వైవిధ్యం చూపిస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే ముందు దేవర పార్ట్ 1, తర్వాత విశ్వం – వెట్టయన్ – మార్టిన్ లను స్వాగ్ కాచుకోవాల్సి ఉంటుంది. ట్రెండ్ ని అనుసరించి ముందు రోజు ప్రీమియర్లు వేయడం లాంటివి ప్లాన్ చేయొచ్చు కానీ మిస్టర్ బచ్చన్ కి ఈ ఐడియా వర్కౌట్ కాని నేపథ్యంలో పీపుల్స్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా కంటెంట్ బాగుండాలే కానీ ఎంత కాంపిటీషనైనా ఏముంది నిక్షేపంగా ప్రేక్షకులను మెప్పించొచ్చు.