నాగార్జున పాత్ర వెనుక పెద్ద ట్విస్టు

సూపర్ స్టార్ రజనీకాంత్ కూలిలో నాగార్జున ఉంటాడనే వార్త నెల రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ ఎట్టకేలకు నిన్న అధికారికంగా ప్రకటించి అభిమానులకు రిలీఫ్ కలిగించారు. ఇటీవలే కూలి సెట్లో ఉపేంద్ర అడుగుపెట్టినప్పుడు నాగ్ స్థానంలోనే అతను వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ రెండు వేర్వేరు పాత్రలని తెలియడంతో ఒక్కసారిగా ఎగ్జైట్ మెంట్ పెరిగిపోయింది. విక్రమ్ లో సూర్య పోషించిన రోలెక్స్ తరహాలో ఇందులోనూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్యామియోలను తీర్చిదిద్ది ఉంటాడనే టాక్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే నాగ్ వెనుక పెద్ద స్కెచ్చే ఉందట.

లోకేష్ కనగరాజ్ కు పాత కల్ట్ క్లాసిక్స్, వాటిలో పాటల మీద ఎంత ప్యాషనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మానగరం నుంచి లియో దాకా అన్నింట్లో ఈ పోకడ గమనించవచ్చు. కూలిలో నాగార్జున చేస్తున్న సైమన్ కు ఎప్పుడో 1978లో వచ్చిన శంకర్ సలీం సైమన్ అనే తమిళ సినిమాకు లింక్ ఉందని తెలుస్తోంది. ఆ సినిమాలో రజనీకాంత్ పేరు ఇప్పుడు నాగ్ కు పెట్టిందే. వాస్తవానికి దీనికి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అమర్ అక్బర్ ఆంటోనీని స్ఫూర్తిగా తీసుకుని వేరే కథను రాసుకున్నారు. ఆంటోనీని బాగా ఇష్టపడిన రజనికి దానికి దగ్గరగా ఉండేలా సైమన్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు దర్శకుడు పి మాధవన్.

సో నాగ్ క్రిస్టియన్ గా కనిపించబోయే క్లారిటీ వచ్చేసింది. బంగారు స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కూలిలో చాలా సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి. మాస్ మహారాజా రవితేజ కూడా ఉంటాడనే టాక్ ఉంది అది నిజమో కాదో ఇవాళ లేదా ఇంకో రెండు రోజుల్లో తేలిపోతుంది. రజని, నాగార్జున, ఉపేంద్ర ఇలా క్రేజీ మల్టీ స్టారర్ రేంజ్ లో రూపొందుతున్న కూలీని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనే లక్ష్యంతో షూటింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యమైన పక్షంలో ఎప్పటిలాగే రజని సెంటిమెంట్ ని ఫాలో అవుతూ దసరా లేదా దీపావళికి లాక్ చేసుకుంటారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్.