మెగా తనయ బోణీ కొట్టేసింది

మెగా ఫ్యామిలీలో హీరోలను మినహాయిస్తే అమ్మాయిల వైపు నుంచి సక్సెస్ అయినవాళ్లు ఇంకా లేరనే చెప్పాలి. సుష్మిత తన తండ్రి చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ విజయవంతంగా నడిపిస్తున్నప్పటికీ నిర్మాతగా కార్డు వేసుకుని నాన్నతో సినిమా తీయాలనే లక్ష్యంతో ఉంది. భోళా శంకర్ ఫ్లాప్ కాకపోయి ఉంటే కళ్యాణ్ కృష్ణతో ప్రాజెక్టు తెరకెక్కేది కానీ తర్వాత నిర్ణయం మారిపోయింది. అలాని ప్రొడ్యూసర్ గా ప్రయత్నాలు ఆపలేదు. చిన్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు తీస్తూ నిర్మాణం కొనసాగిస్తోంది. ఇటీవలే పరువుకి మంచి ఫీడ్ బ్యాకే వచ్చింది. కావాల్సిందల్లా బిగ్ స్క్రీన్ నుంచి బిగ్ బ్రేక్.

ఇక నీహారిక కొణిదెలకు వ్యక్తిగత జీవితంలో కొంత ఇబ్బంది వచ్చాక దాన్నుంచి కోలుకుని నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాక్ పాజిటివ్ గా ఉంది. వసూళ్లు మెల్లగా పెరుగుతున్నాయి. బుక్ మై షోలో రెండు రోజులుగా ట్రెండింగ్ లో ఉంది. సగటున గంటకు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఆన్ లైన్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కౌంటర్ సేల్స్ కలుపుకుంటే మంచి నెంబర్స్ నమోదు కావడం ఖాయమే. ఈ ఆనందం సక్సెస్ మీట్ సందర్భంగా నీహారిక కళ్ళలో కనిపిస్తోంది. వెబ్ సిరీస్ లు ఎన్ని హిట్టయినా సినిమా క్లిక్ అయితే వచ్చే కిక్ వేరుగా ఉంటుంది.

ఒకపక్క వరుణ్ తేజ వరస డిజాస్టర్లతో మార్కెట్ డౌన్ చేసుకున్న టైంలో నీహారిక బోణీ కొట్టడం నాగబాబు ఫ్యామిలీకి ఆనందం కలిగించే విషయమే. ఇకపై కూడా మంచి కథలతో సినిమాలు తీయడం కొనసాగిస్తానని చెబుతున్న నీహారిక కమిటీ కుర్రోళ్ళు రెండో వారంలోనూ దూకుడు కొనసాగిస్తుందనే ఆశాభావంతో ఉంది. ఆగస్ట్ 15న పెద్ద సినిమాల పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో థియేటర్లను అట్టిపెట్టుకోవడం అంత సులభం కాదు. పైగా స్క్రీన్లు తక్కువ ఉండే బిసి సెంటర్లలో ఎగ్బిటర్లు సర్దుబాటు చేయలేరు. ఏదైతేనేం సక్సెస్ టార్గెట్ పెట్టుకున్న నీహారికకు అది దక్కేసినట్టే.