గేమ్ ఛేంజర్ రాకలో అనుమానం వద్దు

ఆ మధ్య రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ లో ఉంటుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించాక ఒక్కసారిగా ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అయితే నిజంగా వస్తుందా లేక దర్శకుడు శంకర్ మళ్ళీ వాయిదా వేయిస్తాడా అనే అనుమానాలు వాళ్లలో లేకపోలేదు. దానికి తగ్గట్టే మార్చికి పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఏమి లేదని ఎస్విసి టీమ్ నుంచి వివిధ రూపాల్లో క్లారిటీ వస్తూనే ఉంది. తాజాగా డబ్బింగ్ పనులు మొదలుపెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్రిస్మస్ రిలీజని ప్రత్యేకంగా మరోసారి పేర్కొన్నారు.

సో గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 రావడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నాగచైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ లు డేట్లు మార్చుకోవాల్సి రావొచ్చు. అయితే పుష్ప డిసెంబర్ 6నే వస్తున్న నేపథ్యంలో రెండు పెద్ద ప్యాన్ ఇండియా సినిమాల మధ్య పధ్నాలుగు రోజుల గ్యాప్ సరిపోతుందా అనేది ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఎందుకంటే బ్లాక్ బస్టర్ మూవీకి కనీసం నెలపాటు బలమైన రన్ ఉంటుందని ఇటీవలే కల్కి 2898 ఏడి నిరూపించింది. మరి రామ్ చరణ్, అల్లు అర్జున్ తక్కువ వ్యవధిలో తలపెడితే పరస్పరం థియేటర్ రెవిన్యూ మీద ప్రభావం పడొచ్చు.

కానీ ఇంతకన్నా ఆప్షన్ లేదు. పుష్ప ముందుకు జరగలేదు. గేమ్ ఛేంజర్ వెనక్కు పోలేదు. రెండు చాలాసార్లు వాయిదాలు ఎదుర్కొని అవాంతరాలు దాటుకుని ఇక్కడిదాకా వచ్చాయి. ఫేస్ టు ఫేస్ క్లాష్ రాకపోవడం కొంత ఊరటని చెప్పాలి. దర్శకుడు శంకర్ చాలా స్పష్టంగా డిసెంబర్ డెడ్ లైన్ కి కట్టుబడి ఉండటంతో దిల్ రాజు కాన్ఫిడెంట్ గా రిలీజ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. జరగండి జరగండి పాట తప్ప ఇంకే ప్రమోషన్ మెటీరియల్ రాని నేపథ్యంలో ఈ నెల 15 నుంచి కొత్తవి ఇవ్వాలనే ప్లాన్ లో ఎస్విసి బృందం ఉందట. సో ఫైనల్ గా మెగాభిమానులు హ్యాపీగా రిలాక్స్ అవ్వొచ్చన్న మాట.