‘వర్షం’ జంటను మళ్లీ చూడబోతున్నామా?

20 ఏళ్ల కిందట ‘వర్షం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన జంట.. ప్రభాస్, త్రిష. టాలీవుడ్ స్క్రీన్ మీద బెస్ట్ పెయిర్స్‌లో వీళ్ల పేర్లు తప్పకుండా ఉంటాయి. ఐతే ‘వర్షం’ తర్వాత మళ్లీ ప్రభాస్, త్రిష కలిసి ‘పౌర్ణమి’ సినిమా చేశారు. కానీ అది పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ వీళ్లిద్దరినీ మరో సినిమాలో చూడలేకపోయాం.

ఐతే సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఆశ్చర్యకరంగా మళ్లీ ప్రభాస్, త్రిషలను ఒకేసారి స్క్రీన్ మీద చూసే అవకాశం రాబోతోందన్నది లేటెస్ట్ న్యూస్. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రభాస్ చాలా పెద్ద రేంజికి ఎదిగిపోయాడు కానీ.. త్రిష కూడా ఈ వయసులోనూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గత ఏడాది తమిళ టాప్ హీరో విజయ్‌తో ఆమె ‘లియో’ చేసింది. అజిత్‌తో ‘విడా ముయర్చి’, కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’, చిరంజీవితో ‘విశ్వంభర’ లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో ఆమె నటిస్తోంది.

ఐతే ఈ చిత్రాలన్నీ ఒకెత్తు అయితే.. ప్రభాస్‌తో సినిమా చేస్తే మరో ఎత్తు అవుతుంది. అది కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించబోతున్న ‘స్పిరిట్‌’లో ఆమె నటించనుందనే వార్త ఎంతో ఎగ్జైట్మెంట్ కలిగించేదే. సందీప్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నటన సహా అన్ని విషయాల్లోనూ అతను ఒక మేకోవర్ ఇస్తాడు.

‘యానిమల్’లో రష్మిక మందన్నా ఎంత ప్రత్యేకంగా కనిపించిందో తెలిసిందే. కాకపోతే తన చిత్రాల్లో కొన్ని బోల్డ్, ఇంటెన్స్ సీన్లు ఉంటాయి. అవి అందరు హీరోయిన్లూ చేయలేరు. లేటు వయసులోనూ తన టర్మ్స్‌లో సినిమాలు చేస్తూ వస్తున్న త్రిష.. సందీప్ చిత్రంలో నటిస్తుందా అన్నదే డౌట్. కానీ ప్రభాస్ సరసన ఈ దశలో సినిమా అంటే చిన్న విషయం కాదు. సందీప్ దర్శకత్వంలో చేస్తే పెర్ఫామర్‌గానూ మరింత పేరు సంపాదించడానికి అవకాశముంటుంది. మరి ఈ వార్త నిజమై మళ్లీ ఇన్నేళ్లకు ‘వర్షం’ జంటను తెరపై చూస్తామా అన్నది ఆసక్తికరం.