రాజ్ తరుణ్‌ను గట్టిగా బిగించేలా ఉన్నాడే..

ఒకప్పుడు జనసేన పార్టీ కోసం పని చేసిన కళ్యాణ్ దిలీప్ సుంకర.. లాయర్ కూడా అన్న సంగతి తెలిసిందే. కొన్ని పేరున్న కేసులు డీల్ చేయడం ద్వారా అతను పాపులారిటీ సంపాదించాడు. నాగబాబు తనయురాలు నిహారికకు విడాకులు ఇప్పించింది కూడా అతనే. ప్రస్తుతం కేడీఎస్ టేకప్ చేసిన కేసు హాట్ టాపిక్‌గా మారింది. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఐతే లావణ్య మీద ప్రతిగా రాజ్ అనేక ఆరోపణలు చేశాడు. అతను కూడా లావణ్య మీద ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పాడు. ఈలోపు రాజ్‌తో సంబంధం ఉందని లావణ్య ఆరోపిస్తున్న మాల్వి మల్హోత్రా అనే ముంబయి అమ్మాయి.. లావణ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇప్పుడీ కేసులోకి దిలీప్ సుంకర ఎంట్రీ ఇచ్చాడు. అతను లావణ్య తరఫున కేసును టేకప్ చేశాడు. రాజ్ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటూ నార్సింగి పోలీసులు లావణ్యకు నోటీసులు ఇవ్వగా.. ఆమె లాయర్ అయిన దిలీప్ సుంకర ఈ పని పూర్తి చేశాడు. ఏకంగా 120కి పైగా కాల్ రికార్డ్స్‌తో పాటు అనేక ఫొటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించినట్లు దిలీప్ మీడియాతో చెప్పాడు.

ఈ సందర్భంగా అతను చెప్పిన మాటలు, చేసిన వాదనలు, ఆరోపణలు చూస్తే.. రాజ్‌ను ఈ కేసులో గట్టిగానే బిగించేట్లు కనిపిస్తోంది. రాజ్.. లావణ్యతో సహజీవనం చేసి మోజు తీరాక వదిలించుకోవాలని చూస్తున్నట్లు దిలీప్ సుంకర ఆరోపించాడు. వీళ్లిద్దరికీ పెళ్లి కూడా జరిగిందని.. విడాకుల కోసం రాజ్ ప్రయత్నించాడు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని అతను చెప్పాడు. లావణ్యకు బలవంతంగా అబార్షన్ చేయించిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను అతను మీడియా ముందు ప్రదర్శించాడు. కేసు వాపస్ తీసుకుంటే ఐదు కోట్లు ఇస్తామంటూ రాజ్ వైపు నుంచి ప్రపోజల్స్ పెట్టిన మెసేజ్‌లు, కాల్ రికార్డ్స్ ఉన్నాయని, రాజ్ డ్రగ్స్ కేసులో లావణ్యను ఎలా ఇరికించడానికి చూశాడు.. ఆమె మీద ఎలా ఎటాక్ చేయించాడు.. ఇలా అనేక విషయాల్లో ఆధారాలున్నాయని.. అవన్నీ పోలీసులు, కోర్టుకు ఇస్తున్నామని.. ఈ కేసులో రాజ్ రిమాండుకు వెళ్లడం ఖాయమని.. తమ ఆరోపణలపై మీడియా ముందు చర్చకు కూడా సిద్ధమని రాజ్, మాల్విలకు దిలీప్ సుంకర సవాలు విసరడం గమనార్హం.