సుప్రీమ్ హీరో మీద అంత బడ్జెట్ సేఫేనా

మావయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో చేశాక సాయి ధరమ్ తేజ్ కు బ్రేక్ వచ్చింది. అంతకు ముందు విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయినా వేగంగా సినిమాలు చేసేందుకు తొందరపడలేదు. సితార సంస్థలో సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ ని అధికారికంగా ప్రకటించిన నెలల తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. కారణాలు బయటికి చెప్పకపోయినా స్క్రిప్ట్ విషయంలో భిన్నాభిప్రాయాలని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో బ్యానర్ మీద సాయి ధరమ్ తేజ్ హీరోగా తీయబోయే ప్యాన్ ఇండియా మూవీకి నూటా పాతిక కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారని సమాచారం.

ఇంత పెద్ద మొత్తం సుప్రీమ్ హీరో మీద వర్కౌట్ అవుతుందానే సందేహం రావడం సహజం. అయితే నిరంజన్ రెడ్డి లెక్కలు వేరుగా ఉన్నాయి. హనుమాన్ తీస్తున్నప్పుడు తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మల మీద అంత ఖర్చు రిస్క్ అవుతుందని భావించిన వాళ్లే ఎక్కువ. కానీ వాటిని పటాపంచలు చేస్తూ మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ పోటీని తట్టుకుని మరీ హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించడం ఎప్పటికీ మర్చిపోలేనిది. అంటే ప్రేక్షకులు హీరోకన్నా ఎక్కువగా కంటెంట్, అందులో గ్రాండియర్ ని ఇష్టపడుతున్నారని అర్థమైపోయింది. కనెక్ట్ అయ్యే రీతిలో చూపిస్తే కనక వర్షం కురిపిస్తారు.

ఈ సూత్రాన్ని నమ్ముకునే ఇంత బడ్జెట్ కి సిద్ధపడినట్టు తెలిసింది. హనుమాన్ విజయం తర్వాత ప్రియదర్శి, నభ నటేష్ కాంబోలో డార్లింగ్ తెరకెక్కించిన ప్రైమ్ షో ఇప్పుడు మొదలుపెట్టబోతున్న సాయి తేజ్ మూవీకి సంబరాల ఏటిగట్టు టైటిల్ ని పరిశీలిస్తోంది. రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేస్తోంది. ఈ సినిమా మేకోవర్ కోసమే తేజు గత కొన్ని నెలలుగా బయటికి రావడం కాదు కదా వేరే కొత్త కథలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఫాంటసీ మిక్స్ తో పాటు సస్పెన్స్, థ్రిల్ కలగలిసిన ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేలా టార్గెట్ చేసుకుని దానికి అనుగుణంగా షూట్ చేయబోతున్నారు.