మనసారా మాట్లాడిన కల్కి దర్శకుడి కబుర్లు

కల్కి 2898 ఏడి విడుదల ముందు వరకు దాని పోస్ట్ ప్రొడక్షన్, బయట ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ తెలుగు మీడియాతో అదే సినిమా సెట్లో సుదీర్ఘంగా మాట్లాడి బోలెడు కబుర్లు పంచుకుని ఎన్నో అనుమానాలు తీర్చేశాడు. అవేంటో చూద్దాం.

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటితో పాటు స్వప్న బ్యానర్ లో నటించిన వాళ్ళను క్యామియోలుగా వాడుకున్న నాగ్ అశ్విన్ కేవలం నాని, నవీన్ పోలిశెట్టిలను మిస్ కావడం గురించి ప్రశ్న ఎదురయ్యింది. ఫస్ట్ పార్ట్ లో కుదరలేదని, కానీ ఖచ్చితంగా సీక్వెల్స్ లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకొస్తానని చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది.

అర్జునుడిగా నటించిన విజయ్ దేవరకొండ చిన్న క్యామియోలా అనిపించినా కథలో అది కీలక పాత్ర కాబట్టి ముందు ముందు చాలా సర్ప్రైజ్ ఉంటుందనే హింట్ కూడా ఇచ్చాడు. కల్కిగా పార్ట్ 2లో ప్రభాస్ ఉంటారా లేక వేరే హీరోనా అనేది వేచి చూడమని చెప్పి సస్పెన్స్ కొనసాగించాడు.

తనకు వ్యక్తిగతంగా కర్ణుడి పాత్ర చాలా ఇష్టమని నాగ్ అశ్విన్ తేల్చేశాడు. ఈ సబ్జెక్టు ముందుగా చిరంజీవి దగ్గరికి వెళ్లిందనే వార్తను కొట్టిపారేశాడు. కల్కి 2లో ప్రభాస్ పాత్ర నిడివి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందని, ఊహించిన దానికన్నా చాలా శక్తివంతంగా ఉంటుందనే హింట్ కూడా ఇచ్చాడు.

రిలీజయ్యాక మహాభారతం గురించి జరుగుతున్న డిబేట్లు సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెప్పిన నాగ్ అశ్విన్ తన సినిమా ద్వారా ఇప్పటి తరం ఇతిహాసాలు, పురాణాలు తిరగేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.

అయితే రెండో భాగానికి సంబంధించి ఇంకా చాలా పనుందని, స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలనే రీతిలో చెప్పడం ఆశ్చర్యపరిచింది. ఇక క్యామియోస్, కొత్త ప్రపంచాలు ఎన్నో కల్కి 2లో ఉంటాయని అంచనాలు పెంచేశాడు. ఇలా కల్కి కబుర్లు బోలెడు పంచుకున్న నాగ్ అశ్విన్ రాజమౌళికి ధీటైన దర్శకుడు వచ్చాడనే కామెంట్ ని అంగీకరించకుండా వినయంగా తిరస్కరించడం విశేషం.