కల్కి టికెట్ రేట్ల పెంపుకి ఏపి సర్కార్ గ్రీన్ సిగ్నల్

పెద్ద సస్పెన్స్ వీడింది. ఊహించిందే అయినా కల్కి 2898 ఏడి టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏపీ సర్కారు అనుకున్నదానికన్నా ఎక్కువ వెసులుబాటు కలిగించింది.

రెండు వారాల పాటు ప్రతి టికెట్ మీద మల్టీప్లెక్సుల్లో 125 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 75 రూపాయలు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చింది. రోజుకి అయిదు షోల చొప్పున అన్నింటికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్సుల సాధారణ టికెట్ రేట్లు 148 – 177 ఉండగా సింగల్ స్క్రీన్ల అప్పర్ క్లాస్ 100 – 112 రూపాయలు ఉంది. వీటికి పైన చెప్పిన అదనపు ధర తోడవుతుంది. 3D, ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలు అదనం.

దీనికి సంబంధించిన జిఓ రాత్రి కొంత ఆలస్యంగా రావడంతో బుక్ మై షో, పేటిఎంలో టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఊరికి సంబంధించిన థియేటర్లు మెల్లగా యాడవుతున్నాయి.

నైజాంతో పోల్చుకుంటే హైక్ ఎక్కువే అనిపించినా మామూలుగానే తెలంగాణలో అమలులో ఉన్న గరిష్ట ధరతో పోల్చుకుంటే ఏపీ ప్రేక్షకులు ఆ రాష్ట్రం కన్నా తక్కువ ధరకే కల్కి 2898 ఏడి చూస్తారు. టికెట్లు అందుబాటులోకి రావడం ఆలస్యం రికార్డుల ఊచకోత మొదలవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. షాకింగ్ నెంబర్స్ ఉండబోతున్నాయి.

ఇది సంతోషం కలిగించే వార్తే అయినా నైజామ్ లాగా ఆరో షో గురించిన ప్రస్తావన ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జిఓలో లేదు. ఇక్కడ అర్ధరాత్రి ప్రీమియర్లు ఉంటాయని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఆ ఆశ తీరే అవకాశం కనిపించడం లేదు. ఉదయం 4.30 నుంచి 5 గంటల కన్నా ముందే స్పెషల్ షోలు ఉండకపోవచ్చు.

అంచనాలు విపరీతంగా ఉన్న కల్కి 2898 ఏడి టికెట్ల కోసం థియేటర్ యజమానుల మీద మాములు ఒత్తిడి లేదు. పలుచోట్ల ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేసి బుక్ చేసుకుంటున్న పరిస్థితి. ఎల్లుండి ఈ సమయానికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక జరగబోయే వసూళ్ల ఊచకోతకు అడ్డుకట్ట ఉండదు.