ఆ సినిమాపై అనుమానాలకు తెర

యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటించాల్సిన ఓ సినిమా విషయంలో చాన్నాళ్ల నుంచి అనుమానాలున్నాయి. అదే.. మట్కా. ‘పలాస’ దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘హాయ్ నాన్న’ నిర్మాతలు ప్రొడ్యూస్ చేయాల్సిన చిత్రమిది. ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీయాలని అనుకున్నారు.

ఐతే ఓకే అయ్యే సమయానికి అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వరుణ్ తేజ్‌కు బాక్సాఫీస్ దగ్గర వరుసగా రెండు భారీ దెబ్బలు తగిలాయి. గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. వరుణ్ మార్కెట్ మీద అవి తీవ్ర ప్రభావమే చూపాయి. మరోవైపు దర్శకుడు కరుణ్ కుమార్ ఇప్పటిదాకా కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలు విమర్శల ప్రశంసలు అందుకున్నాయే తప్ప డబ్బులు తీసుకురాలేదు.

ఈ నేపథ్యంలో ఏకంగా 60 కోట్లు పెట్టి ‘మట్కా’ సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు వెనుకంజ వేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. సినిమా అనౌన్స్ చేశాక నెలలు గడుస్తున్నా షూటింగ్ మొదలు కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. టీం కూడా ఈ ప్రచారాన్ని ఖండించకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. వరుణ్ కొత్త ప్రాజెక్టుల గురించి వార్తలు వస్తున్నా.. ‘మట్కా’ ఊసు మాత్రం లేకపోవడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం సందేహమే అనుకున్నారంతా.

ఐతే ఎట్టకేలకు ఈ ప్రచారాలకు, సందేహాలకు తెరదించుతూ ‘మట్కా’ సెట్స్ మీదికి వెళ్లింది. సైలెంటుగా ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేసింది టీం. వరుణ్ చాలా నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు హాజరవుతున్నది ఈ చిత్రంతోనే. మరి అతడికి ‘మట్కా’ ఓ మంచి విజయాన్నందించి కెరీర్‌ను గాడిన పెడుతుందేమో చూడాలి.