సరైన చేతిలో పడ్డ మాస్ బచ్చన్

మాస్ మహారాజాకు ధమాకా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ పడలేదు. వాల్తేరు వీరయ్య ఉన్నప్పటికీ అది చిరంజీవి సినిమా కాబట్టి పూర్తి క్రెడిట్ దక్కలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఇలా వరసగా యాక్షన్ జానర్ లో చేసిన ప్రయోగాలు వికటించిన ఫలితాలిచ్చాయి. అందుకే ఈసారి రవితేజ రిస్క్ చేయకుండా మిరపకాయ్ దర్శకుడికి ఎస్ చెప్పాడు. ఆరేళ్ళ క్రితం 2018లో వచ్చిన బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ మీద తొలుత అనుమానాలుండేవి. ఆ కథ మనకు నప్పుతుందానే సందేహం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ కలిగింది.

నిన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ షో రీల్ ఆ సందేహాలను దాదాపుగా తీర్చేసింది. ఒక్క డైలాగు లేకుండా కేవలం యాక్షన్ సీన్లతో కట్ చేసిన ఒక్క నిమిషం వీడియో అభిమానులకు తెగ నచ్చేసింది. నిజానికి రైడ్ రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్టు కాదు. బాగా డబ్బున్న ఒక పెద్ద మనిషి ఇంటికి హీరో ఇన్కమ్ టాక్స్ రైడింగ్ కు వెళ్తే అతను తన మనుషులను, పలుకుబడిని అడ్డం పెట్టుకుని తీవ్ర ఆటంకాలు సృష్టిస్తాడు. అయినా సరే పట్టువదలకుండా కోట్ల రూపాయల దొంగ సొమ్ముని, అవినీతిని హీరో బయటపెడతాడు. స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచే రైడ్ లో ఆర్టిస్టులు తక్కువగా ఉంటారు.

గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లాంటి రీమేకులను ఒరిజినల్ కథను మాత్రమే తీసుకుని తనదైన ట్రీట్ మెంట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ కు సైతం అదే సూత్రాన్ని ఫాలో అయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా విలన్ సౌరభ్ శుక్లా స్థానంలో జగపతిబాబుని ఎంచుకోవడం బాగా పేలేలా ఉంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతున్న మిస్టర్ బచ్చన్ ని త్వరలో విడుదల చేసేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్ట్ లో పుష్ప తప్పుకున్నా డబుల్ ఇస్మార్ట్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేయబోతున్నారు. టీజర్ తో పాటు విడుదల తేదీ ప్రకటిస్తారు.