మెగా హీరో.. అది క్యాన్సిల్, ఇది ఫిక్స్

మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై దాన్నుంచి కోలుకున్నాక రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి ‘విరూపాక్ష’ బ్లాక్‌బస్టర్ అయింది. మరో చిత్రం ‘బ్రో’ ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమా రిలీజయ్యాక తేజు.. కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. తనకు ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటి నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొంత టైం కావాలని అతను చెప్పాడు.

ఐతే చెప్పిన దాని కంటే తేజు ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఈపాటికే అతను సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ మొదలుపెట్టాల్సింది. కానీ బడ్జెట్, ఇతర సమస్యల కారణంగా అది హోల్డ్‌లో పడిపోయింది. సంపత్ ఆ చిత్రాన్ని పట్టాలెక్కించే విషయంలో ఆశాభావంతోనే కనిపించాడు. కానీ అది కోరిక తీరట్లేదని తెలుస్తోంది. ‘గాంజా శంకర్’ దాదాపుగా ఆగిపోయినట్లే భావిస్తున్నారు.

ఎందుకంటే తేజు ‘గాంజా శంకర్’ ఊసెత్తకుండా కొత్త సినిమాను ప్రకటించాడు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి బేనర్లో తేజు కొత్త సినిమా తెరకెక్కబోతోంది. రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ రోజే ఈ చిత్రాన్ని ప్రకటించాల్సింది. సాయంత్రం 4.05 గంటలకు ముహూర్తం కూడా నిర్ణయించారు. కానీ ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ కారణంగా ఈ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదని ప్రైమ్ షో సంస్థ ఈ రోజు ట్విట్టర్లో ప్రకటించింది. త్వరలోనే ప్రకటన రాబోెతున్నట్లు వెల్లడించారు.

ఐతే అనౌన్స్‌మెంట్ ఆలస్యం కావచ్చు కానీ.. తేజు తర్వాత చేయబోయే సినిమా మాత్రం ఇదే. తేజు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో ప్రెస్టీజియస్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని.. ఇది తేజు ఇంత వరకు చేయని జానర్లో తెరకెక్కే సినిమా అని అంటున్నారు. మరి ‘గాంజా శంకర్’ సంగతేంటో చూడాలి.