శర్వా స్థానంలో విశ్వక్.. ఈషా బదులు ఆయేషా

లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య.. ‘ఛల్ మోహన రంగ’ తర్వాత ఇంకో సినిమా చేయడానికి చాలా టైమే తీసుకున్నాడు. ముందు నితిన్‌తో ‘పవర్ పేట’ అనే సినిమా చేయడానికి సిద్ధమైన అతను.. ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసి ఇక షూటింగ్‌కు వెళ్లడమే తరువాయి అన్నట్లు కనిపించాడు. కానీ ఆ చిత్రం బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత శర్వాతో అతను సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ సంగతి ఏమైందో తెలియదు. ఆపై విశ్వక్సేన్ హీరోగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మొదలుపెట్టాడు.

ఇది కూడా కొంచెం ఆలస్యం అయి.. ఎట్టకేలకు ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఈషా రెబ్బాను ఒక ఐటెం సాంగ్ కోసం ఎంచుకుని తర్వాత ఆయేషా ఖాన్‌తో ఆ పాట షూట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఈ మార్పులు చేర్పుల గురించి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సందర్భంగా వివరణ ఇచ్చాడు కృష్ణచైతన్య. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని ముందు శర్వానంద్‌తోనే తీద్దాం అనుకున్నాం. కానీ అంతకుముందే శర్వా ఇలాంటి ఎమోషనల్ సినిమా (రణరంగం కావచ్చు) చేశాడు కాబట్టి తర్వాత చేద్దాం అన్నాడు. దీంతో కొన్ని రోజుల అనంతరం విశ్వక్‌ను సంప్రదించి అతడితోనే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇక ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌ను ఈషా రెబ్బాతోనే ఒక రోజు షూట్ చేశాం. కానీ ఆమెకు హెల్త్ ఇష్యూ వచ్చింది. బాగా ఖర్చు పెట్టి వేసిన సెట్స్ వేస్ట్ కాకూడదని అప్పటికప్పుడు ఆయేషా ఖాన్‌ను సంప్రదించి ఆమెతో ఈ పాట చేశాం. ఇదంతా ఈషాతో మాట్లాడాకే జరిగింది’’ అని కృష్ణచైతన్య తెలిపాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం మంచి హైప్ మధ్యే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.