మొన్న విజయేంద్ర ప్రసాద్.. నేడు రష్మిక

గత ఏడాది టాలీవుడ్లో మోస్ట్ సర్ప్రైజింగ్ హిట్ ఏది అంటే బేబి పేరే చెప్పాలి. సలార్, వాల్తేరు వీరయ్య లాంటి పెద్ద చిత్రాలు భారీ వసూళ్లు సాధించి ఉండొచ్చు కానీ.. పెద్దగా పేరు లేని హీరో హీరోయిన్లను పెట్టి అంతగా అనుభవం లేని సాయిరాజేష్ తీసిన బేబి సాధించిన వసూళ్లు మాత్రం అనూహ్యం. ఈ చిన్న సినిమా వంద కోట్ల వసూళ్లు రాబట్టడం చూసి ఇండస్ట్రీ అంతా షాకైంది.

ముందు ‘బేబి’ గురించి తక్కువ చేసిన మాట్లాడిన వాళ్లు కూడా ఈ సినిమాను గుర్తించి కొనియాడారు. కల్ట్ బ్లాక్‌బస్టర్ అని కేవలం టీం సభ్యులు చెప్పుకోవడం కాదు.. ప్రేక్షకులు సైతం ఆ విషయాన్ని అంగీకరించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడు సాయి రాజేష్ రేంజే మారిపోయింది. ఎంతోమంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా రిలీజై పది నెలలు దాటినా అతడి మీద ప్రశంసలు ఆగట్లేదు. తరచుగా ఏదో ఒక ఈవెంట్లో ‘బేబి’ సినిమా మీద పొగడ్తలు కురుస్తూనే ఉన్నాయి.

ఇటీవలే లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ఒక ఈవెంట్లో ‘బేబి’ సినిమా గురించి, ఈ సినిమాలో దర్శకుడి పనితనం గురించి కొనియాడారు. ఆ ఈవెంట్లో పాల్గొన్న సాయి రాజేష్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.

ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. సాయి రాజేష్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. ‘బేబి’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’ ఈ శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రష్మిక హాజరైంది. సాయి రాజేష్ సైతం ఇందులో పాల్గొన్నాడు. తన స్పీచ్ చివర్లో రష్మిక.. సాయి రాజేష్ గురించి మాట్లాడింది. తాను ఈ మధ్యే ‘బేబి’ సినిమా చూసి షాకయ్యానని.. తనకు ఏడుపు కూడా వచ్చిందని రష్మిక తెలిపింది. ఒక నటిగా ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో తనకు తెలుసని.. సినిమా చూడగానే తాను సాయి రాజేష్‌తో పని చేయాలని అనుకున్నానని.. ఆయన చిత్రంలో ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలని అనిపించిందని రష్మిక తెలిపింది.