మాయాబజార్ మాయాజాలాన్ని మిస్ కావొద్దు

తెలుగు సినిమా చరిత్రలో స్క్రీన్ ప్లే పరంగా అతి గొప్ప పాఠంగా ప్రతి ఒక్కరు భావించే మాయాబజార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెవి రెడ్డి దర్శకత్వంలో నాగిరెడ్డి, చక్రపాణిలు సంయుక్తంగా నిర్మించిన ఈ ఆణిముత్యం ఎన్ని తరాలు మారినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మేటి నటుల మేలు కలయికతో మహాభారతంలోని శశిరేఖ పరిణయానికి ఒక కాల్పనిక గాధని జోడించి రూపొందించిన తీరు నభూతో నభవిష్యత్. ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ – ఏస్విఆర్ – సావిత్రి – గుమ్మడి – సూర్యకాంతం – ముక్కామల – కన్నాంబ – రమణారెడ్డి  లాంటి ఎందరో దిగ్గజాలు ఇందులో అజరామరమైన నటనను ప్రదర్శించారు.

1957లో మొదటిసారి విడుదలైన ఈ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ ఎన్నిసార్లు పునఃవిడుదలయ్యిందో లెక్క చెప్పడం కష్టం. కొన్ని దశాబ్దాల పాటు మాయాబజార్ చూడని తెలుగు కుటుంబం ఈ భూమి మీద ఉండదనే స్థాయిలో మీడియాలో దీని గొప్పదనాన్ని వివరించేది. 2009లో గోల్డ్ స్టోన్ సంస్థ కలర్, సినిమా స్కోప్, డిటీఎస్ సౌండ్ తో సరికొత్త రీ మాస్టర్ ప్రింట్ ని థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధం చేసింది. సుమారు ఏడు కోట్లకు పైగా ఖర్చుతో రంగులు, హంగులు అద్ది 2010లో రిలీజ్ చేశారు. రంగుల్లో మాయాబజార్ ని చూసి వృద్ధులు, పెద్దలు సంభ్రమాశ్చర్యానికి లోనవ్వడం థియేటర్లలో కనిపించింది.

ఇప్పుడు మరోసారి మాయాబజార్ ని ప్రేక్షకుల ముందు తీస్తున్నారు. రేపు మే 28 నుంచి పరిమిత సంఖ్యలో పలు నగరాల్లో ప్రత్యేక షోలు వేయబోతున్నారు. ఒకవేళ పదిహేనేళ్ల క్రితం మిస్ అయ్యుంటే మాత్రం ఇప్పుడు చూస్తే దక్కే అనుభూతి వేరుగా ఉంటుంది. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నప్పటికీ పెద్ద తెరపై, డాల్బీ సౌండ్ తో వీక్షిస్తే కలిగే ఎక్స్ పీరియన్స్ ని దేంతోనూ కొలవలేం. పైగా హైదరాబాద్ లోని  కొన్ని మల్టీప్లెక్సులు టికెట్ ధర కేవలం 112 రూపాయలు పెట్టడం మరింత చేరువ చేస్తుంది. కొత్త వెర్షన్ లో భళీ భళీ దేవా పాట, భస్మాసుర నాటకం, కొన్ని సీన్లు ఎడిట్ చేశారు. తక్కినదంతా దృశ్యకావ్యమే.