ఇళయరాజా హక్కులు – తెలియని కోణాలు

పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా అనుసరిస్తున్న శైలి సోషల్ మీడియాలో మద్దతుని, వ్యతిరేకతను సమానంగా తెచ్చుకుంటోంది. మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతలకు నోటీసులు పంపాక దీని మీద పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. అసలు ఎక్కువ శాతం జనాలకు తెలియని కోణాలను ఇప్పుడు చూద్దాం. మాములుగా ఏదైనా సినిమాకు సంగీతం అందించినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పారితోషికం తీసుకున్నాక దానికి యజమాని నిర్మాతే అవుతాడు. ఆ హక్కులను కంపెనీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. వాళ్ళు సిడి, క్యాసెట్, ఆన్ లైన్, యాప్స్ తదితర మాధ్యమాల ద్వారా ఆదాయం వచ్చేలా బిజినెస్ చేసుకుంటారు.

ఇళయరాజా వెర్షన్ ఏంటంటే తన కంపోజింగ్స్ కి సంబంధించి తానే మొదటి హక్కుదారు అనేది. తన పేరుని పెద్దక్షరాలతో హైలైట్ చేసి వాడుకుంటారు కాబట్టి తన మేధో సంపత్తిని అమ్మడమేనని ఆయన వాదన. రాజా ఆల్బమ్స్ కి సంబంధించి ఎకో, సోనీ, ఐఎంఎం (రాజా స్వంత కంపెనీ) ముగ్గురికి హక్కులు ఉండటంతో ఎవరికి వారు తమ ప్లాట్ ఫార్మ్స్ లో వాటిని అందుబాటులో ఉంచారు. గుణ విషయానికి వస్తే పిరమిడ్ మ్యూజిక్ నుంచి హక్కులు కొన్న మంజుమ్మల్ బాయ్స్ మేకర్స్ ఆ కారణంగానే నిర్భయంగా సినిమాలో వాడుకున్నారు. ఇళయరాజాని కనీసం అడగలేదన్నది పాయింట్. అంతే తప్ప డబ్బులు ఇవ్వమని డిమాండ్ కాదు.

1957 కాపీ రైట్స్ చట్టం ప్రకారం ఒరిజినల్ క్రియేటివ్ వర్క్ కి సంగీత దర్శకుడు యజమాని అయినప్పటికీ సెక్షన్ 17 ప్రకారం అసలు ఓనర్ నిర్మాతే అవుతాడు. 2012లో చేసిన సవరణ ప్రకారం ఒక పాటమీద వచ్చే ఆదాయం గీత రచయితతో సహా అందరికి ఎంతో కొంత అందాలనే వెసులుబాటు ఉంది. దీంట్లో ఉన్న మెలిక వల్ల ఇది పూర్తి స్థాయి అమలులో లేదు. ఇదంతా ఒక వ్యవస్థగా అమలు పరచడానికి ఐపిఆర్ఎస్(ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్) ఉంది.నిర్మాతకు 50 శాతం, మిగిలిన సగం సంగీత దర్శకుడు, లిరిసిస్ట్,సింగర్స్ కి వచ్చేలా చేయడం దీని బాధ్యత. కాకపోతే సభ్యత్వం కోసం రుసుము చెల్లించాలి. ఇందులో రాజా సభ్యులుగా లేరు. అయినా హక్కు ఉంటుంది. ఫైనల్ గా చెప్పలంటే ఇది అంత సులభంగా తేలే వ్యవహారం అయితే కాదు.