పవన్ నిర్మాతల మనసులో బొమ్మా బొరుసు

ఏదైనా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేస్తారు. బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందాని ఇరు జట్ల కెప్టెన్లు ఎదురు చూడటం, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ సస్పెన్స్ తో వెయిట్ చేయడం సహజం. ఇప్పుడు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ నిర్మాతలకు వచ్చింది. టీడీపీ జనసేన పొత్తుని ఎలాగైనా గెలిపించాలనే సంకల్పంతో సినిమా ప్రపంచాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన పవర్ స్టార్ తిరిగి ఎప్పటి నుంచి సెట్స్ లో అడుగు పెడతారనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. జూన్ మొదటి వారంలో పోలింగ్ ఫలితాలు వచ్చే దాకా షూటింగ్ లో పాల్గొనకపోవచ్చనేది స్పష్టం.

ఇక అసలు పాయింట్ కు వద్దాం. ఈ ఎలక్షన్లలో పవన్ పిఠాపురం నుంచి మాత్రమే కాదు కూటమి మొత్తం ఏపీలో మెజారిటీ సాధించి అధికారంలోకి రావడం చాలా కీలకం. ఎందుకంటే నిర్మాణంలో ఉన్నపవర్ స్టార్ సినిమాలన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ వే అని మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఓజి, హరిహర వీరమల్లు రెండు భాగాలుగా బహు భాషల్లో రాబోతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ వీటితో పోలిస్తే తక్కువ స్కేల్ దే అయినా మైత్రి సంస్థ పెట్టుబడి విషయంలో రాజీ పడటం లేదు. ఇవన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సమానంగా టికెట్ రేట్ల పెంపుకి నోచుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవకాశాలు మెరుగు పరుచుకుంటాయి.

అది టిడిపి జనసేన పవర్ లో ఉంటేనే సాధ్యమవుతుంది. జగన్ సర్కార్ పవన్ సినిమాలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విషయంలో చూశాం. ఏకంగా రెవిన్యూ అధికారులే థియేటర్ల దగ్గర కాపలా ఉన్నారు. సో రిజల్ట్స్ వచ్చే వరకు బొమ్మా బొరుసా అనే ఆందోళన రేగడం సహజం. ఇక్కడ చెప్పినవే కాకుండా పవన్ మరికొన్ని కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వాల్సి ఉంది. సురేందర్ రెడ్డి వెయిటింగ్ లో ఉన్నాడు. ఇది అధికారికంగానే లాకయ్యింది. మరికొన్ని ఫైనల్ కావాలి. పవన్ ఒకవేళ ఎమ్మెల్యే అయినా బాలకృష్ణ లాగా రెండు పడవల ప్రయాణం చేయడం కష్టంగా అనిపించకపోవచ్చు.