సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల స‌మ‌న్లు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీలో జ‌ర‌గను న్న విచార‌ణ‌కు రావాల‌ని స‌మ‌న్ల‌లో పేర్కొన్నారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ఈ ప‌రిణామం కాంగ్రెస్ పార్టీలో కుదుపున‌కు దారితీసింది. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వ‌చ్చిన పోలీసులు సీఆర్ పీసీ సెక్ష‌న్ 91 మేర‌కు నోటీసులు ఇచ్చారు. తొలుత ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి రాగా.. అక్క‌డ నుంచి గాంధీ భ‌వ‌న్‌కు చేరుకున్నారు. పార్టీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌కి స‌మ‌న్లు అందించారు. సోష‌ల్ మీడియా ఇంచార్జి స‌హా.. సీఎం రేవంత్ కూడా విచార‌ణ‌కు రావాల‌ని దానిలో పేర్కొన్నారు.

ఏంటి కార‌ణం..

ప్ర‌స్తుత ఎన్నిక‌ల స‌మ‌యంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం మ‌రోసారి కొలువు దీరితే.. ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తుంద ని.. వాటిని ఓబీసీల‌కు కేటాయిస్తుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం శాఖ ఇప్ప‌టికే ఫైరైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను, విదానాల‌ను ప్ర‌చారం చేసేవారిపై కేసులు పెట్టాల‌ని త‌క్ష‌ణం అరెస్టు కూడా చేయాల‌ని ఆదేశించింది. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నేత‌.. కేంద్ర‌హోం మంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న కూడా ఖండించారు.

ఇక‌, తెలంగాణ సీఎం విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల సిద్దిపేట‌లో అమిత్ షా బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగంలో ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గిస్తామ‌ని.. వీటిని ఓబీసీల‌కు ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు ఓ వీడియో వైర‌ల్ అయింది. దీనిని త‌ర్వాత స‌భ‌ల్లో రేవంత్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌జ‌ల‌కు వినిపించార‌న్న‌ది ప్ర‌దాన అభియోగం. ఈ కార‌ణంగానే ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేశారు. ఇక‌, అమిత్ షా అన‌ని వ్యాఖ్య‌ల‌ను అన్న‌ట్టుగా ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను మార్ఫింగ్ చేశార‌న్న‌ది కాంగ్రెస్ సోష‌ల్ మీడియా విభాగం ఇంచార్జ్‌పై ఉన్న మ‌రో ప్ర‌ధాన అభియోగం. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర హోం శాఖ ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేసి.. స‌మ‌న్లు జారీ చేశారు.  అయితే.. దీనిపై సీఎం రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.