కీర్తి సినిమా రిలీజే గొప్పంటే.. మళ్లీ వివాదమా?

కీర్తి సురేష్ చిన్న స్థాయి కథానాయికగా ఉన్నపుడు తెలుగులో మొదటగా ఒప్పుకున్న సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా పరిచయం కావాల్సిన సినిమా ఇది. ‘నందిని నర్సింగ్ హోమ్’ కంటే ముందు అతను ఈ సినిమానే మొదలుపెట్టాడు. కీర్తి సైతం తెలుగు తెరకు ఈ చిత్రంతోనే పరిచయం కావాల్సింది. కానీ ‘నేను శైలజ’నే ముందు విడుదలైంది.

‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా అనివార్య కారణాల వల్ల చివరి దశలో ఆగిపోయింది. ఆ తర్వాత అది ఎంతకీ విడుదల కాలేదు. ఈలోపు కీర్తి చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఐతే ఇప్పుడు కీర్తి ‘మహానటి’తో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన సమయంలో ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాను ‘జానకితో నేను’ అని టైటిల్ మార్చి త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.

ఈ సినిమాకు సంబంధించి ఇంకా కొంత చిత్రీకరణ మిగిలి ఉండగా.. దాన్ని పూర్తి చేయడానికి కీర్తి షూటింగ్‌కు కూడా హాజరు కాబోతోందని, ఇప్పుడు తన స్థాయికి తగని సినిమా అయినా సరే.. తన బాధ్యతగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటోందని వార్తలొచ్చాయి. ఐతే జనాల్లో ఏమంత ఆసక్తి లేని ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత విడుదలవడమే గొప్ప అనుకుంటుంటే.. మళ్లీ దాని మీద వివాదం మొదలైంది.

టాలీవుడ్లో వివాదాలకు పెట్టింది పేరైన నట్టి కుమార్ ఈ సినిమాను సీనియర్ నిర్మాత చంటి అడ్డాల విడుదల చేస్తామనని ప్రకటించడం పట్ల అభ్యంతరం చెబుతున్నాడు. చంటి నుంచి ఈ సినిమా హక్కులు ఎప్పుడో కొన్నానని.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తన దగ్గర ఉన్నాయని.. ఈ సినిమా తన సొంతమని.. మరి చంటి ఎలా రిలీజ్ చేస్తాడని అతను ప్రశ్నించాడు. మరి ఇలా వివాదం ముసురుకున్న సినిమాను పూర్తి చేయడానికి కీర్తి ముందుకొస్తుందా.. ఈ సినిమా నిజంగా విడుదలవుతుందా అన్నది సందేహంగానే కనిపిస్తోంది.