పారితోషకం తగ్గించా.. ఛాన్స్ ప్లీజ్

ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఛాన్సులివ్వడంలో, అలాగే వాళ్లను ఇగ్నోర్ చేయడంలో ఒక మ్యాడ్‌నెస్ కనిపిస్తుంటుంది. కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు హిట్లు పడ్డాయంటే చాలు లక్కీ ఛార్మ్ అంటూ వరుసగా ఛాన్సులిచ్చేస్తారు. పారితోషకాలు కూడా స్థాయికి మించి సమర్పించుకుంటారు. కానీ అదే హీరోయిన్‌కు వరుసగా కొన్ని ఫ్లాపులు వచ్చాయంటే చాలు.. లైట్ తీసుకుంటారు. ఐరెన్ లెగ్ ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు.

కన్నడ భామ కృతి శెట్టి పరిస్థితి ఇలాగే తయారైంది. వంద కోట్ల సినిమా ‘ఉప్పెన’తో ఆమె కథానాయికగా పరిచయం అయింది. తొలి సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకోవడం, సినిమా కూడా పెద్ద హిట్టవడంతో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. తెలుగులో రెండో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కూడా హిట్టవడంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. చూస్తుండగానే పారితోషకం రెండు కోట్లు దాటిపోయింది.

కానీ ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా కింద పడింది కృతి. మూడో చిత్రం ‘బంగార్రాజు’ యావరేజ్‌గా ఆడగా.. తర్వాత చేసిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆమెకు డిమాండ్ పడిపోయింది. అవకాశాలు ఆగిపోయాయి. ఏడాది పాటు తెలుగులో ఒక్క కొత్త సినిమా కూడా ఒప్పుకోలేదు కృతి.

ఈ మధ్యే శర్వానంద్ సినిమా ‘మనమే’లో ఓ కథానాయికగా ఛాన్స్ దక్కించుకుంది. తనపై ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర పడడంతో గ్లామర్ ఫొటో షూట్లు చేస్తూ సెక్సీగా కనిపించడానికి కూడా సిద్ధమని చాటుతోంది కృతి. అయినా ఆమెకు ఛాన్సుల్లేవు. ఈ మధ్య పారితోషకం కూడా సగానికి సగం తగ్గించినట్లు సమాచారం. అయినా తెలుగులో అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తమిళంలో మాత్రం ఆమెకు రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి.