దిల్ రాజుపై ట్రోల్.. భార్యే చూపించిందట

టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు అంతగా వార్తల్లో ఉండే వ్యక్తి మరొకరు ఉండరు. సోషల్ మీడియాలో కూడా తరచుగా ఆయన పేరు చర్చనీయాంశం అవుతుంటుంది. ఆయన స్టేజ్‌ల మీద మాట్లాడే మాటలు.. ఇంటర్వ్యూలు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. తన భార్య అనిత చనిపోయిన కొన్నేళ్లకు రాజు.. తేజస్వినిని రెండో పెళ్లి చేసుకోవడం.. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టడం తెలిసిందే.

ఐతే లేటు వయసులో రాజు చేసుకున్న పెళ్లి మీద కూడా ట్రోలింగ్ తప్పలేదు. ముఖ్యంగా రాజు.. తేజస్వితో పరిచయం.. తర్వాత తమ పెళ్లి జరగడం గురించి ఓ ఇంటర్వ్యూలో చెబితే.. దాని మీద కూడా ఆయన్ని ట్రోల్ చేశారు. ఐతే ఈ ట్రోల్స్ అన్నింటినీ రాజు కూడా చూశారట. అవన్నీ తన భార్యే తనకు చూపిందని.. తనను ఈ ట్రోల్స్ పెద్దగా ప్రభావితం చేయవని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రాజు.

“నాకు గతంలో మీమ్స్‌, ట్రోల్స్ గురించి అవగాహన లేదు. నా పెళ్లి తర్వాత ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నా భార్యను ఎలా కలిసింది, మా జర్నీ ఎలా మొదలైంది వివరించాను. ఆ వీడియోపై ట్రోల్స్‌ చేశారు. అవి నా భార్య చూపించింది. నేను వాటి గురించి పట్టించుకోను. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్‌ చేసే వాళ్ళు పదివేల మంది ఉంటారేమో. ఇలా ట్రోల్స్‌, నెగెటివ్‌ కామెంట్స్‌ చేసే వాళ్ల గురించి పట్టించుకుంటే నేను మిగతా వాళ్లకు దూరమవుతాను. అందుకే నేను అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించను. నేను ఆకాశం లాంటివాడిని. ట్రోల్స్ ఏమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవు కదా! ట్రోల్స్ మేఘాల్లాంటివి. అవి వెళ్లిపోయాక మనకు ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది’’ అని దిల్ రాజు పేర్కొన్నాడు.