తన మరణ వార్తపై దర్శకుడి ఫన్నీ పోస్ట్

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును తీవ్రంగా వ్యతిరేకించే బాలీవుడ్ లిబరల్స్ బ్యాచ్‌లో స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఒకరు. మోడీ సర్కారు హిందుత్వ విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. గత ఏడాది మోడీ సర్కారు తీసుకొచ్చి పౌరసత్వ సవరణ చట్టంతో పాటు అనేక అంశాలపై ఆయన లౌకిక వాదులతో కలిసి పోరాటం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాజపా మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం ఆయనకు వారి నుంచి నిరసన ఎదురవుతుంటుంది. అనురాగ్ గురించి ట్రోల్స్ సర్వ సాధారణం. వారిని ‘భక్త్స్’గా అభివర్ణిస్తూ అనురాగ్ కూడా దీటుగా స్పందిస్తూ ఉంటాడు. తాజాగా అనురాగ్ హఠాత్తుగా మరణించాడు, అతడి ఆత్మకు శాంతి కలగాలి అంటూ ఆయన వ్యతిరేకులు ఒక రూమర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది అనురాగ్ దృష్టికి వచ్చింది.

దీనిపై అనురాగ్ తనదైన శైలిలో స్పందించాడు. ముందు రోజు తాను యమధర్మరాజును కలిశానని.. ఐతే ఆయనే స్వయంగా తనను తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడని.. ‘‘నువ్వు ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. నువ్వు సినిమాలు చేయకుంటే భక్తులకు నీ సినిమాలను బహిష్కరించే అవకాశం ఎలా దక్కుతుంది’’ అని తనతో అన్నాడని అనురాగ్ తన పోస్టులో పేర్కొన్నాడు. ఇది చూసి ఆయన మద్దతుదారులు ‘భక్త్స్’కు భలే పంచ్ ఇచ్చారంటూ కొనియాడుతున్నారు. ఇలాంటి సంచనల వ్యాఖ్యలు, చర్యలు అనురాగ్‌కు కొత్తేమీ కాదు. మోడీ సర్కారుకు పూర్తి మద్దతుదారుగా పేరున్న రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామిని తీవ్రంగా వ్యతిరేకించే అనురాగ్.. తాజాగా స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో కలిసి.. ముంబయిలోని రిపబ్లిక్ టీవీ ఆఫీసుకు వెళ్లాడు. కాలి చెప్పు చిత్రానికి ఫొటో ఫ్రేమ్ కట్టించి దాన్ని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ రూపంలో అర్నాబ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.