ఎప్పటి సినిమా.. ఇప్పుడు రిలీజేంటి?

మాయవన్ అని తమిళ సినిమా. మన సందీప్ కిషన్ అందులో హీరో. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. తమిళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. నిర్మాతగా *పిజ్జా’; ‘సూదు కవ్వుం’ లాంటి అద్భుతమైన సినిమాలు ప్రొడ్యూస్ చేసి తన అభిరుచిని చాటుకున్న సీవీ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

కొత్త కాన్సెప్ట్‌తో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగే ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. ఐతే ఎప్పుడో 2017లో తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రాజెక్ట్-జడ్ పేరుతో ఈ శుక్రవారమే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత తెలుగులోకి వస్తుండటం విడ్డూరంగా అనిపిస్తోంది.

నిజానికి ‘మాయవన్’ తమిళంలో రిలీజ్ అయిన టైంలోనే ‘ప్రాజెక్ట్-జడ్’ పేరుతో తెలుగులోని అనువాదం చేశారు. రిలీజ్‌కు సన్నాహాలు చేశారు. కానీ ఏవో కారణాలతో అది అప్పుడు విడుదల కాలేదు. తర్వాత తెలుగు వెర్షన్ ఆన్ లైన్లో రిలీజైంది. చాలామంది తెలుగులోనే ఈ సినిమా చూశారు కూడా. కానీ ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి ఏం సాధిస్తారన్నది అర్థం కాని విషయం.

ఐతే తమిళంలో ‘మాయవన్’కు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. సీవీ కుమారే దర్శకుడు, సందీప్ కిషనే హీరో. దీన్ని తమిళంతో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ పార్ట్ తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నట్లున్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత పెద్దగా పబ్లిసిటీ లేకుండా థియేటర్లలో రిలీజయ్యే సినిమాను ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే. ఇది వృథా ప్రయాస అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.