తెలుగు ప్రేక్షకుల తత్వం బోధపడిన పృథ్విరాజ్

పృథ్విరాజ్ సుకుమారన్ ఆడు జీవితం ది గోట్ లైఫ్ కు విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు ఖాయమని జోస్యం చెబుతున్నారు. కేరళతో పాటు ఓవర్సీస్ మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వంద కోట్ల గ్రాస్ ఖాయమని ట్రేడ్ నమ్మకంగా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. టిల్లు స్క్వేర్ ప్రభంజనం వల్ల ఎవరూ పట్టించుకోలేదనే స్టేట్ మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే దానికి ఎదురుగా ఇంకో కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. అందులో డౌట్ లేదు.

హైదరాబాద్ వచ్చి మరీ పృథ్విరాజ్ ప్రమోషన్లు చేసుకున్నప్పటికీ జనాలకు అవి రీచ్ కాలేదు. కారణాలు బోలెడు. మొదటిది మూడు గంటలు సాగే సుదీర్ఘమైన ఎమోషనల్ డ్రామాలు తెలుగు ప్రేక్షకులకు అంతగా అలవాటు లేదు . పైగా ఏదో కష్టాలు మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేద్దామని థియేటర్ కు వస్తే గల్ఫ్ దేశంలో ఒక మనిషి పడే నరకయాతనని అంతసేపు చూసేందుకు ఇష్టపడలేదు. పెర్ఫార్మన్స్ పరంగా కట్టిపడేసిన మాట వాస్తవమే కానీ మన జనాలకు కనెక్ట్ అయ్యేలా డ్రామా, ఎమోషన్లు లేకపోవడం మైనసయ్యింది. పైగా మ్యూజికల్ గానూ పాటలు పదే పదే వినేలా అనిపించలేదు.

ఇదే కంటెంట్ కేరళవాసులకు కనెక్ట్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లకు స్లో డ్రామాలు అలవాటే. మొన్నటికి మొన్న మమ్ముట్టి భ్రమయుగం అక్కడ రికార్డులు సాధిస్తే ఇక్కడ మొదటి వీకెండ్ కే చేతులు ఎత్తేసింది. సో మలయాళీ హీరోలు టాలీవుడ్ లవర్స్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేగం, భావోద్వేగం, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ వీటిలో ఏ జానర్ తీసుకున్నా కట్టిపడేసే అంశాలు ఉంటే తప్ప ఆదరణ దక్కడం కష్టం. ప్రేమలు ఏపీ తెలంగాణలో 17 కోట్లు ఎలా వసూలు చేసిందని విశ్లేషణ చేసుకుంటే సమాధానం దొరికేస్తుంది. ఫలితం చూశాక వరదరాజ మన్నార్ కు ఈ తత్వం బోధపడినట్టే ఉంది.