కిరణ్ ప్యాన్ ఇండియా సినిమా ఏమైంది

ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్సిన యూత్ హీరో కిరణ్ అబ్బవరం సెలక్షన్లో వేస్తున్న తప్పటడుగుల వల్ల వరుస ఫ్లాపులు రుచి చూస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథకు కమర్షియల్ కోణంలో డీసెంట్ సక్సెస్ దక్కినా దాని ముందు తర్వాత వచ్చిన నేను మీకు బాగా కావాల్సినవాడిని, మీటర్, రూల్స్ రంజన్ లు దారుణమైన డిజాస్టర్లతో మార్కెట్ ని దెబ్బ తీశాయి. పైగా సోషల్ మీడియా ట్రోలింగ్ కి ఛాన్స్ ఇచ్చాయి. సమ్మతమే పర్వాలేదు కానీ సెబాస్టియన్ మరీ అన్యాయంగా దెబ్బ కొట్టింది. అందుకే కుర్రాడు కొంచెం స్పీడ్ తగ్గించాడు.

ఇటీవలే తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తో నిశ్చితార్థం చేసుకున్న కిరణ్ అబ్బవరం త్వరలో దిల్ రుబాతో పలకరించ బోతున్నాడు. అయితే నిర్మాత నిరంజన్ రెడ్డి తనతో ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నారని హనుమాన్ నిర్మాణ సమయంలోనే టాక్ వచ్చింది. కొత్త దర్శకుడితో ముప్పై కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ని సిద్ధం చేసారని వినిపించింది. తర్వాత ఎలాంటి లీక్స్ లేవు. నిరంజన్ రెడ్డి త్వరలో సాయి దుర్గ తేజ్, నితిన్ లతో వేర్వేరు ప్రాజెక్టులను లాక్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. జై హనుమాన్ ఎలాగూ జరుగుతుంది.

అలా అయితే కిరణ్ అబ్బవరంతో అనుకున్న చిత్రం వాయిదా పడిందా లేదా అసలుకే ఆగిపోయిందా అనే దాని గురించి క్లారిటీ లేదు. డెబ్యూ డైరెక్టర్ కనక రిస్క్ ఎందుకనుకున్నారో ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కిరణ్ అబ్బవరంకు సరైన బ్రేక్ రావడం లేదు. ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా మొదటి రోజు తన కోసం థియేటర్ కు వచ్చే ప్రేక్షకులను కనీస స్థాయిలో మెప్పించేలా చేయడంలో విఫలమవుతున్నాడు. దిల్ రుబాతో కలిసి మొత్తం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్న కిరణ్ అబ్బవరంకు వాటిలో పెద్ద బ్రేక్ ఇచ్చేది ఏదవుతుందో చూడాలి మరి.