టాలీవుడ్ కోసం మంచు విష్ణు భారీ ఈవెంట్

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) కోసం భారీ భవనం కట్టించడంతో పాటు అనేక కార్యక్రమాలు చేపడతాననే హామీలు ఇచ్చి రెండేళ్ల కిందట ‘మా’ ఎన్నికల్లో గెలిచాడు మంచు విష్ణు. బిల్డింగ్ కట్టించకపోయినా కొన్ని హామీలైతే నెరవేర్చాడు. ఐతే ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ఇండస్ట్రీ తరఫున పెద్ద ఈవెంట్ అయితే ఏదీ చేయలేదు.

కొన్ని కార్యక్రమాల కోసం ప్లానింగ్ జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. ఐతే ఈ ఏడాది జులైలో మలేషియాలో భారీ ఎత్తున టాలీవుడ్ కోసం ఓ ఈవెంట్ చేయబోతున్నట్లు మంచు విష్ణు వెల్లడించాడు. హైదరాబాద్‌లో జరిగిన ‘మా’ ప్రెస్ మీట్లో విష్ణు ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘నవతి’ పేరుతో ఈ ఈవెంట్ జరుగుతుందని, నభూతో అనేలాగా ఈ ఈవెంట్ నిర్వహిస్తామని విష్ణు వెల్లడించాడు.

“రెండేళ్ల కిందట ‘వనతి’ పేరుతో 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్‌ చేయాలనుకున్నాం. అనేక కారణాల వల్ల ఆ వేడుక వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి ఈవెంట్స్‌ గతంలో కూడా జరిగాయి. అప్పటి టీమ్ ఫండ్ రైజింగ్ కూడా బాగా చేసింది. ఇప్పుడు అంతకుమించి ఫండ్‌ రైజ్‌ అయ్యేలా భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

ఈ ఈవెంట్ మలేషియాలో నిర్వహిస్తాం. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి డేట్ ప్రకటిస్తాం. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు స్వర్ణయుగం నడుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి గారికి పద్మవిభూషణ్‌ రావడం గొప్ప విషయం. కీరవాణి గారు ఆస్కార్‌ అందుకున్నారు. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ప్రభాస్‌ హైయెస్ట్ పెయిడ్‌ ఇండియన్ యాక్టర్‌ అయ్యాడు. మహేష్‌-రాజమౌళి సినిమా ఆసియాలోనే బిగ్గెస్ట్ మూవీ కాబోతోంది.

తెలుగు సినిమా ఇన్ని ఘనతలు సాధించిన ఈ సమయంలో ఇలాంటి ఉత్సవం చేయడం కరెక్ట్‌ అనిపించింది. ఈ విషయం గురించి ఛాంబర్‌ పెద్దలతో మాట్లాడాం. రెండు, మూడు రోజులు ఇండస్ట్రీకి సెలవు ఇవ్వాలని కోరాం. దిల్‌ రాజు గారు, దాము గారు సపోర్ట్‌ చేస్తామన్నారు. తెలుగు సినిమా ఘనకీర్తిని చాటిచెప్పేలా నవతి ఈవెంట్‌ చేయబోతున్నాం’’ అని విష్ణు తెలిపాడు.