పూజా హెగ్డే చేతికి స్టార్ వారసుడి సినిమా

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డేకి టైం ఏ మాత్రం బాలేదు. 2023లో ఒక్కటంటే ఒక్కటి సౌత్ రిలీజ్ లేకపోవడం బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయి దుర్గ తేజ్ సరసన గాంజా శంకర్ లో ఛాన్స్ వచ్చిందనుకుంటే అది ఆగిందో ఉందో అర్థం కాని అయోమయం నెలకొంది. దీనికన్నా ముందు గుంటూరు కారం ఒక షెడ్యూల్ చేసి మరీ తప్పుకోవాల్సి రావడం ఇంకో ట్విస్టు. ఇవన్నీ పక్కన పెడితే ఇంత గ్యాప్ తర్వాత ఈ బుట్టబొమ్మకి స్టార్ వారసుడి సరసన ప్రాజెక్టు లాక్ అయ్యింది. కాకపోతే అది కూడా హిందీలోనే కావడం కొసమెరుపు.

వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి రెండేళ్ల క్రితం తడప్ తో డెబ్యూ చేశాడు. ఇక్కడ సంచలనం సృష్టించిన ఆరెక్స్ 100 రీమేక్ ఇది. ఏరికోరి హిట్టు సబ్జెక్టు తీసుకున్నాడు కానీ నార్త్ లో ఆడలేదు. ఫలితంగా తొలి అడుగే ఫ్లాప్ తో మొదలయ్యింది. ఇప్పుడు రెండోది సాజిద్ నడియాడ్ వాలా బ్యానర్ లో చేయబోతున్నాడు. ఇండియాతో పాటు విదేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి అద్నాన్ ఏ షేక్ – యాసిర్ ఝా జంట దర్శకత్వం వహించబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు రిలీజ్ చేయబోతున్నారు.

సంకీ టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. ముందు నుంచి ఉత్తరాదిలో పాగా వేయాలని చూస్తున్న పూజా హెగ్డేకు ఎటొచ్చి సక్సెస్ పలకరించడం లేదు. వయసు పట్టించుకోకుండా మరీ సల్మాన్ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసీకా జాన్ చేస్తే అది కాస్త ట్రోలింగ్ చేసుకునే స్థాయిలో డిజాస్టర్ అయ్యింది. 2022లో ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్, సర్కస్ ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టడం మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. ఈలోగా శ్రీలీల, రష్మిక మందన్నలు అనూహ్యంగా పికప్ కావడంతో పూజా హెగ్డే డిమాండ్ తగ్గిపోయింది. మరి సంకీ అయినా కోరుకున్న బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.