వర్మ వ్యూహం ఫలించిందా

ఒకప్పుడు కల్ట్ ఫిలిం మేకింగ్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ నుంచి శివ, క్షణ క్షణం, సత్య, రంగీలా లాంటి మాస్టర్ పీసులు ఎన్నో వచ్చాయి. హారర్ జానర్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన భూత్ కూడా ఆయన సృష్టే. అలాంటి వర్మ గత దశాబ్దంన్నర కాలంలో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో, ఎలా స్థాయి తగ్గించుకున్నారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వన్ సైడ్ రాజకీయ ఉద్దేశాలతో లక్ష్మీస్ ఎన్టీఆర్, కడప రాజ్యంలో అమ్మ బిడ్డలు లాంటి సి గ్రేడ్ పొలిటికల్ మూవీస్ తో దాన్ని ఇంకా కిందకు తీసుకెళ్లారు. అందుకే వ్యూహం మీద అంచనాల్లేవ్. అయినా ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం.

సెన్సార్ సమస్యలు, వివాదాల వల్ల పాత్రల పేర్లు మార్చిన వర్మ నిజ జీవితంలో అవి ఎవరివో ఈజీగా స్ఫురించేలా కథను నడిపించాడు. వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, అయన కొడుకు మదన్(అజ్మల్) ముఖ్యమంత్రి కాకుండా జరిగిన ప్రయత్నాలు, ప్రతిపక్ష నాయకుడు ఇంద్రబాబు(ధనుంజయ్ ప్రభు) వేసే ఎత్తులు, సినీ నటుడు శ్రవణ్ కళ్యాణ్ ప్రమేయం తదితరాలన్నీ వ్యూహంలో జొప్పించారు. అయితే వన్ సైడ్ అజెండాతో వర్మ దీన్ని ఒక సినిమాటిక్ డ్రామాగా కన్నా స్పూఫ్ ల రూపంలో ఎగతాళి చేసేలా సీన్లు, డైలాగులు రాయించడంతో పూర్తిగా తేడా కొట్టేసింది.

తెలిసిన సంఘటనలకు మసిపూసి మారేడుకాయ చేసి కేవలం అధికార పార్టీకి లబ్ది చేకూరాలనే సంకల్పంతో తీసిన సినిమా కాబట్టి తక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ తో షార్ట్ ఫిలిం స్టాండర్డ్ తో ఏదో చుట్టేశారు తప్పించి వ్యూహం ఎలాంటి ప్రత్యేకతను సంతరించుకోలేకపోయింది. కొన్ని చోట్ల నవ్వించినా మిగిలినదంతా సహనానికి పెద్ద పరీక్షే పెట్టాడు. ఆర్టిస్టులు అతికినట్టు సరిపోయారు కానీ వాళ్ళ ప్రతిభను వాడుకునేలా కంటెంట్ ని డిజైన్ చేయలేదు వర్మ. ఏపీ రూలింగ్ పార్టీ ఫ్యాన్స్ కూడా తట్టుకోవడం కష్టమనేలా ఉంది వ్యూహం. ఇంతకన్నా వర్మ నుంచి ఏం ఆశిస్తాం అనుకుంటే వదిలేయడం ఉత్తమం.