యానిమల్ పార్క్ గురించి సందీప్ స్పష్టత

గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పఠాన్, జవాన్, గదర్ 2 సరసన స్థానం సంపాదించుకున్న యానిమల్ కొనసాగింపు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న అభిమానులు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. కబీర్ సింగ్ తోనే గొప్ప గుర్తింపు తెచ్చుకున్నా యానిమల్ దెబ్బకి టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వాంటెడ్ సెలబ్రిటీగా మారిపోయాడు. అందుకే ఈవెంట్లకు, లాంచులకు స్పెషల్ గెస్టుగా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక వేడుకలో సందీప్ వంగా ఒక ముఖ్యమైన విషయం పంచుకున్నాడు.

యానిమల్ పార్క్ ఇప్పట్లో రాదనే క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని తేల్చి చెప్పాడు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథను సరికొత్త పంథాలో చెప్పబోతున్నానని, ప్రభాస్ ని గతంలో చూడని ఒక కొత్త మేకోవర్ లో ఆవిష్కరిస్తానని వివరించాడు. ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదు కానీ డార్లింగ్ అభిమానులకు కావాల్సిన కీలకమైన పాయింట్ అయితే దొరికేసింది. అయితే స్పిరిట్ స్క్రిప్ట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయనేది మాత్రం చెప్పలేదు. ఇంకో ఏడాది పట్టినా ఆశ్చర్యం లేదేమో.

ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ , కల్కి 2898 ఏడిలు సమాంతరంగా చేస్తున్నాడు. హను రాఘవపూడితో చేసే ప్యాన్ ఇండియా మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైపోయాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంని ఈ ఏడాదే మొదలుపెట్టే ఛాన్సుందని బెంగళూరు వర్గాలు ఉటంకిస్తున్నాయి. మరి స్పిరిట్ ఎప్పుడు కార్యరూపంలోకి వస్తుందనేది వేచి చూడాలి. సందీప్ వంగాకు దీంతో పాటు యానిమల్ పార్క్ కాకుండా అల్లు అర్జున్ తో ఒక కమిట్ మెంట్ ఉంది. వీటికే ఇంకో మూడు నాలుగేళ్లు సులభంగా పడుతుంది. ఆ తర్వాతే ఇతర హీరోలకు ఛాన్స్ ఉంటుంది.