ఓజి హీరోయిన్ విచిత్రమైన పరిస్థితి

కెరీర్ ప్రారంభంలో నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం లాంటి మంచి అవకాశాలే దక్కినా వాటి బాక్సాఫీస్ ఫలితాలు నిరాశ పరచడంతో తమిళంకి షిఫ్ట్ అయిపోయి అక్కడే మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ ప్రియాంకా మోహన్. సూర్య, ధనుష్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోల సరసన హిట్లు పడటంతో చక్కగా సెటిలైపోయింది. ఇది గుర్తించిన టాలీవుడ్ దర్శకులు తనను తిరిగి తీసుకోవడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఓజి, నాని సరిపడా శనివారంలకు డబుల్ ప్యాకేజ్ కింద డివివి బ్యానర్ ఏకంగా రెండు ఆఫర్లు ఇవ్వడంతో ఇతర నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు.

ఇలాంటి టైంలో ప్రియాంకా మోహన్ కు ఓ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె టిక్ టాక్ అనే సినిమా చేసింది. దాంట్లో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయి. మరీ విచ్చలవిడిగా కాదు కానీ పేరున్న హీరోయిన్లు చేసీ తరహాలో మాత్రం కాదు. తెలిసి తెలియక ఒప్పుకున్న ఛాన్స్ కావడంతో చేసేసింది. ,గత డిసెంబర్ లో వేరే పంపిణి సంస్థ ద్వారా రిలీజయ్యింది. ఎవరూ పట్టించుకోలేదు. ప్రియాంకాకు పెరిగిన క్రేజ్ ని నిర్మాత క్యాష్ చేసుకోవాలని చూస్తే పని జరగలేదు. ఎందుకా అంటే ముఖ్యమైన ఇరవై నిముషాల కీలకమైన ఫుటేజీని ఎడిటింగ్ చేసి తీసేశారట.

ఇదంతా తనకు తెలియకుండా జరిగిందంటూ నిర్మాత గత నెలే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తనకు చెప్పకుండా కట్ చేయడం వల్లే డిజాస్టర్ అయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి తీశానని ఇప్పుడు దీన్ని ఎవరు భర్తీ చేస్తారని వాపోతున్నాడట. అసలు రిలీజ్ చేయడమే తలనొప్పి అంటే తన మీదే అభియోగం వేసేలా దాన్నే పట్టుకు ఇంకా వేలాడుతున్న నిర్మాత పట్ల ప్రియాంకా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో ఇలాంటి చేదు అనుభవాలు హీరోలకూ ఉన్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని పెద్దలు ఊరికే చెబుతారా.