వర్మ సినిమా.. వైసీపీ వాళ్లయనా చూస్తారా?

రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే జనం ఈ మధ్య బాగా లైట్ తీసుకుంటున్నారు. తన మార్కు సినిమాలను ఆయన పక్కన పెట్టేసి చాలా కాలం అయింది. ఒక దశలో తన స్థాయిని బాగా దిగజార్చుకుని బి గ్రేడ్, పోర్న్ సినిమాలు కూడా చేశారాయన. ఆ తర్వాత తనను నమ్మి సినిమాలు తీసే వాళ్లే లేకపోవడంతో రాజకీయ పార్టీలు, నేతల కోసం అరువు చిత్రాలు తీయడం మొదలుపెట్టారు.

గత ఏడాది వరంగల్ జిల్లా నేతలు కొండా మురళి, కొండా సురేఖల కోసం ‘కొండా’ అనే సినిమా తీసి పెట్టారు వర్మ. కానీ ఆ సినిమా రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియలేదు. కొన్ని కోట్లు పెట్టి సినిమా తీయించుకున్న కొండా దంపతులకు పెట్టుబడి మొత్తం వృథా అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతల మద్దతుతో ‘వ్యూహం’ అనే సినిమా తీశారు.

అనేక అడ్డంకులను దాటి శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘వ్యూహం’. ఐతే కోర్టు కేసులు, గొడవల వల్ల వచ్చిన పబ్లిసిటీతో అయినా సినిమా జనాల దృష్టిలో పడుతుందనుకుంటే అలాంటి సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. ఈ వారం వస్తున్న చిన్న చిత్రాలు సిద్దార్థ్ రాయ్, సుందరం మాస్టార్ అయినా కొంత సౌండ్ చేస్తున్నాయి కానీ.. ‘వ్యూహం’ గురించి ఎవరికీ పట్టింపే లేదు. వర్మ ఎంత ప్రయత్నిస్తున్నా సినిమా పట్ల జనాల్లో ఆసక్తి కనిపించడం లేదు. వర్మ కోరుకున్నట్లు టీడీపీ, జనసేన వాళ్లు క్యూరియాసిటీతో సినిమా చూస్తారన్న అంచనాలు కూడా లేవు. వాళ్లు పూర్తిగా ఈ సినిమాను ఇగ్నోర్ చేస్తున్నారు.

వర్మను పట్టించుకోకపోవడమే ఆయనకు పెద్ద శిక్ష అనే విషయం వాళ్లకు అర్థమై చాలా కాలమైంది. పోనీ వైసీపీ వాళ్లయినా ఈ సినిమాను ఓన్ చేసుకుంటున్నారా అంటే అదీ లేదు. జగన్ బయోపిక్ ‘యాత్ర-2’నే వాళ్లు లైట్ తీసుకున్నారు. మరీ నాసిరకంగా కనిపిస్తున్న ‘వ్యూహం’ సినిమాను వాళ్లయినా చూస్తారా అన్నది సందేహమే.