ఒకే కథతో మూడు సినిమాలు ఎలా సాధ్యం

తెరమీద కాదు వెనుక కూడా విచిత్రాలు జరగడం పరిశ్రమలో మాములే. కొన్ని బయటికి కనిపిస్తాయి. మరికొన్ని తెలియకుండా జరిగిపోతాయి. ఉదాహరణకు అప్పుడెప్పుడో కృష్ణంరాజు ప్రాణ స్నేహితులు బాగా ఆడితే దాన్ని రజనీకాంత్ అన్నామలైగా రీమేక్ చేసుకుని సూపర్ హిట్ కొట్టాడు. తిరిగి దీన్నే వెంకటేష్ కొండపల్లి రాజాగా మార్చుకుని విజయం సాధించాడు. బాషా తర్వాత సూపర్ స్టార్ మార్కెట్ పెరగడంతో అన్నామలైని బిర్లా రాముడుగా డబ్బింగ్ చేస్తే డబ్బులొచ్చాయి. వీటిలో ఉన్నదంతా ఒకే కథ. సన్నివేశాలు కూడా చాలా మటుకు ఒకేలా ఉంటాయి. ఇక వర్తమానానికి వద్దాం.

స్టార్ రైటర్ గా పేరున్న బెజవాడ ప్రసన్న కుమార్ మీద మొదట్లో ఒక కామెంట్ ఉండేది. ఒకే స్టోరీని మళ్ళీ మళ్ళీ అమ్ముతున్నాడని. దానికెప్పుడూ స్పందించలేదు కానీ ఇన్నేళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. సినిమా చూపిస్త మావాని రాజ్ తరుణ్ తో ప్లాన్ చేసుకున్నప్పుడు కాస్త బోల్డ్ కంటెంట్ ఆలోచించానని, కానీ హీరోయిన్ అవికా గోర్ అభ్యంతరం వల్ల దాన్ని మామా అల్లుళ్ళ కామెడీ డ్రామాగా మారిస్తే వర్కౌట్ అయ్యిందని చెప్పాడు. తర్వాత దిల్ రాజు అలాంటి పాయింట్ మీద సబ్జెక్టు అడగటంతో నాని నేను లోకల్ రాసిస్తే అది కూడా సక్సెస్ కావడం మర్చిపోలేని విషయమన్నాడు.

అక్కడితో అయిపోలేదు. తిరిగి హలో గురు ప్రేమ కోసమేలో ఇదే మామా అల్లుళ్ళ థ్రెడ్ కి ఫ్రెండ్ షిప్ ని జోడించి వినోదం, ప్రేమ పాలు పెంచితే అది కూడా హిట్టు లిస్టులో చేరిపోవడం గురించి వివరించాడు. ఈ మూడింటికి త్రినాథరావు నక్కిననే దర్శకుడు కావడం గమనార్హం. తక్కువ గ్యాప్ లో ఇలా జరగడం అరుదు. అలా అని దీన్ని పూర్తిగా వదిలేయలేదు ప్రసన్న. ధమాకాలో రవితేజ రావు రమేష్ మధ్య ఇలాంటి ఎపిసోడ్లు ఉంటాయి. నా సామిరంగకు దర్శకత్వం వహించే ఛాన్స్ ని తృటిలో మిస్ చేసుకున్న ప్రసన్న కుమార్ దాని రచయితగా మరో హిట్టు బొమ్మనయితే ఖాతాలో వేసుకున్నాడు.