బొమ్మరిల్లు జెనీలియా జంటది భలే తెలివి

ఇప్పుడు కనిపించడం మానేసింది కానీ బొమ్మరిల్లు టైంలో హీరోయిన్ జెనీలియాకు వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బక్కపలచని దేహంతో ఉన్నా చలాకీతనం, ఆకట్టుకునే కళ్ళు, గలగలా మాట్లాడే నోరు తక్కువ టైంలో ఎక్కువ ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టాయి. దెబ్బకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల సరసన జోడి కట్టేందుకు వెంటనే ఆఫర్లు వచ్చాయి. వాటిలో అధిక శాతం ఆశించిన విజయాలు సాధించకపోవడంతో క్రమంగా తెరమరుగై బాలీవుడ్ నటుడు రితీష్ దేశముఖ్ ని పెట్టుకుని హ్యాపీగా ముంబైకి మకాం మార్చేసింది.

కథ ఇక్కడితో అయిపోలేదు. మాములుగా గృహిణిగా మారాక ఆర్టిస్టులు సపోర్టింగ్ రోల్స్ కి మారిపోతారు. పైగా రితీష్ కూడా డిమాండ్ తగ్గిపోయిన హీరో. సహజంగానే ఇతర వ్యాపకాల మీద దృష్టి పెడతారు. కానీ ఈ జంట అలా ఆలోచించలేదు. నాగచైతన్య సమంత మజిలీ రీమేక్ రైట్స్ కొనుక్కుని రెండు సంవత్సరాల క్రితం మరాఠిలో వేద్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించారు. రితీష్ హీరోగా నటించడంతో పాటు స్వయంగా తొలి దర్శకత్వం కూడా చేశాడు. వంద కోట్ల వసూళ్లు దాటేశాయి. కట్ చేస్తే ఇప్పుడు అతని డైరెక్షన్ లోనే భారీ బడ్జెట్ తో రాజా శివాజీని తెరకెక్కిస్తున్నారు.

నిన్న అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. చూస్తుంటే భార్యాభర్తల తెలివైన ప్లానింగ్ కి సూపర్ అనకుండా ఉండలేం. కెరీర్ లో తనకో గుర్తింపునిచ్చిన టాలీవుడ్ నుంచే తన భర్త డెబ్యూకి కావాల్సిన సినిమాను వెతుక్కోవడం దగ్గరే జెనీలియా చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. మజిలీని హిందీలోనే తీయొచ్చు. అలాంటివి అక్కడ చాలా వచ్చాయి. కానీ మరాఠిని ఎంచుకోవడం ద్వారా అద్భుత ఫలితం దక్కింది. మహారాష్ట్రలో శివాజీకున్న ఆరాధనాభావం గురించి అందరికీ తెలిసిందే. ఏకంగా జియో స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉండటమంటే మాటలా.