ఎమోషనల్ కథలకే సాయిపల్లవి ఓటు

అందం ఎందరిలోనో ఉంటుంది కానీ దానికి మించి నటించే టాలెంట్ అందరికీ ఉండదు. అందుకే సాయిపల్లవి ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ కథ నచ్చి పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉంటే తప్ప ఎస్ చెప్పని ఈమెను ఒప్పించడం దర్శకులకు అంత సులభం కాదు. డాన్స్ పరంగా తాను విపరీతంగా అభిమానించే చిరంజీవి చెల్లిగా భోళా శంకర్ లో ముందు ఆఫర్ చేస్తే రీమేక్ అనే ఒకే కారణంతో చేయనని చెప్పేసింది. ఇలాంటి తిరస్కారాలు బోలెడున్నాయి. సూర్యతో చేసిన ఎన్జికె ఒక్కటే తొందరపడి ఒప్పుకున్న సినిమాగా కనిపిస్తుంది.

ప్రస్తుతం సాయిపల్లవి లైనప్ చూస్తే భావోద్వేగాలకు పెద్ద పీఠ వేసే సబ్జెక్టులకు మాత్రమే ఓటేస్తోంది. తండేల్ లో స్నేహితుల కోసం పాకిస్థాన్ వెళ్లి చిక్కుకుపోయిన ప్రియుడి కోసం పోరాటం చేసే యువతీగా దర్శకుడు చందూ మొండేటి తన పాత్రను చాలా డెప్త్ గా డిజైన్ చేశాడట. శివ కార్తికేయన్ సరసన చేస్తున్న మూవీలో స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్యగా కనిపిస్తుందని చెన్నై టాక్. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం హీరో నిజంగానే కఠినమైన మిలిటరీ శిక్షణ తీసుకోవడం విశేషం. ఈ తరహా జానర్ ని మేజర్ తో అడవి శేష్ మొదలుపెట్టాడు.

అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జట్టుకట్టిన చిత్రం కూడా హెవీ లవ్ ఎమోషన్స్ తో ఉంటుందట. ప్రస్తుతం దీని షూటింగ్ కీలక దశలో ఉంది. విదేశాల్లో షెడ్యూల్ జరుగుతోంది. ఈ మూడు తప్ప ఇంకెవరికి సాయిపల్లవి కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. విరాట పర్వం లాంటివి డిజాస్టర్ అయినా సరే పాత్రను ప్రేమిస్తే వాటి కమర్షియల్ లెక్కలు ఆలోచించకుండా ఓకే చెప్పే ఫిదా భానుమతికి ధనుష్ నాగార్జున మల్టీస్టారర్ కోసం శేఖర్ కమ్ముల అడిగారట. కానీ ఎందుకో నో చెప్పడంతో రష్మిక మందన్నకు వెళ్లిందని వినికిడి. అవకాశాలు వస్తున్నా ఇంత పట్టుదలగా ఉండటం ఇప్పటి హీరోయిన్లలో అరుదే.