కల్ట్ దర్శకుడితో రామ్ చరణ్ 17

ఇంకా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా మొదలుకాకుండా అప్పుడే రామ్ చరణ్ 17 గురించిన ప్రచారం మొదలైపోయింది. బాలీవుడ్ కల్ట్ దర్శకుడిగా పేరున్న సంజయ్ లీలా భన్సాలీతో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడనే వార్త ఊపందుకుంది. గత కొంత కాలంగా చరణ్ విపరీతంగా ముంబై ట్రిప్పులు కొడుతున్నాడు. అది ఈ ప్రాజెక్టు కోసమేననే కామెంట్లకు లింక్ కుదురుతోంది. గతంలో అల్లు అర్జున్ తోనూ ఓ చిత్రం ప్లాన్ చేసుకున్న భన్సాలీ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఆ స్థానంలోనే చరణ్ వచ్చాడన్నది నార్త్ మీడియా టాక్. నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పదకొండో శతాబ్దానికి చెందిన సుహల్ దేవ్ అనే పోరాట యోధుడి గాధను తెరకెక్కించేందుకు భన్సాలీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. శ్రావస్టి సామ్రాజ్యానికి రాజైన ఈ చక్రవర్తి అతి తక్కువ సైన్యంతో ఘాజి సలార్ మసూద్ ని ఓడించి చంపడం గురించి చరిత్రలో ఎన్నో కథలున్నాయి. వాటి ఆధారంగానే దీన్ని తెరకెక్కిస్తారట. ఒకవేళ ఇదే వాస్తవమైతే అంతకన్నా గూస్ బంప్స్ అభిమానులకు ఇంకేముంటుంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చివరి దశలో షూటింగ్ లో ఉన్న చరణ్ తర్వాత బుచ్చిబాబు సెట్లో అడుగు పెడతాడు. నాన్ స్టాప్ గా డేట్లు ఇచ్చేలా ఆల్రెడీ ప్లానింగ్ జరిగింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత విపరీతమైన గ్యాప్ వచ్చేయడంతో అభిమానుల నుంచి చరణ్ మీద ఒత్తిడి ఉంది. ఏడాదికి కనీసం ఒక్క రిలీజ్ లేకపోతే ఎలానేది వాళ్ళ ప్రశ్న. వాళ్ళు అడగటం న్యాయమే అయినా దర్శకుడు శంకర్ వల్ల మెగా పవర్ స్టార్ ఎటూ కదల్లేని పరిస్థితి. ఒకవేళ ఇండియన్ 2 లేకపోయి ఉంటే ఈ టెన్షన్, చర్చ రెండూ ఉండేవి కాదు. రాజ్ కుమార్ హిరానీ పేరు కూడా ఆ మధ్య వినిపించింది కానీ అది వాస్తవం కాదట. ఎలాగైనా 2024లోనే గేమ్ ఛేంజర్ ని విడుదల చేయాలని చూస్తున్న నిర్మాత దిల్ రాజు సంకల్పం నెరవేరాలని మెగా ఫ్యాన్స్ మూకుమ్మడిగా కోరుకుంటున్న మాట.