రాజమౌళిని మర్చిపోని అవతార్ దర్శకుడు

ప్రపంచంలోనే బెస్ట్ ఫిలిం మేకర్స్ ఎవరయ్యాని సర్వే చేస్తే ఎక్కువ శాతం వినిపించే పేరు జేమ్స్ క్యామరూన్. టెర్మినేటర్, టైటానిక్ తో మొదలుపెట్టి అవతార్ దాకా ఆయన సృష్టించిన విజువల్ వండర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఇంగ్లీష్ రాని వాళ్లకు సైతం డబ్బింగ్ లేకుండా ఆయన సినిమాలు విభ్రాంతికి గురి చేస్తాయి. అలాంటి లెజెండరీ ఒక తెలుగు దర్శకుడిని పదే పదే గుర్తు చేసుకోవడం విశేషమే. గత ఏడాది ఆస్కార్ ఈవెంట్ సందర్భంగా ప్రత్యేకంగా రాజమౌళిని మెచ్చుకుంటూ పొగిడిన క్యామరూన్ వీడియో తెగ వైరల్ కావడం చూశాం. కానీ కథ అక్కడితో ఆగలేదు.

మొన్న ఫిబ్రవరి 4న లాస్ ఏంజిల్స్ లో మారియట్ బర్ బ్యాంక్ ఎయిర్ పోర్ట్ హోటల్ లో 51వ వార్షిక సాటర్న్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. హాలీవుడ్ అతిరధ మహారథులెందరో దీనికి హాజరయ్యారు. సహజంగా అత్యధిక పురస్కారాలు దక్కించుకున్న అవతార్ డైరెక్టర్ గా జేమ్స్ క్యామరూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఒక ఇంగ్లీష్ మీడియా ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ స్టీవెన్ స్పిల్బర్గ్, లూకాస్ లాంటి ఎందరి నుంచో తాను స్ఫూర్తి చెందుతానని, ఇండియాలో ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చి స్టాండర్డ్ పెరుగుతోందని కితాబు ఇచ్చారు.

నిజానికి అక్కడ ట్రిపులార్ ప్రస్తావన లేకుండా మాట్లాడవచ్చు. కానీ గుర్తు చేసుకుని మరీ చెప్పడమంటే చిన్న విషయం కాదు. ఒకవేళ హాలీవుడ్ మూవీ తీయాలనే ఆలోచన ఉంటే చెప్పు నేను చేతులు కలుపుతానని గతంలో రాజమౌళితో క్యామరూన్ అన్న మాట సరదాకు కాదనే విషయం అర్థమైపోయిందిగా. ఈ లెక్కన మహేష్ బాబు 29ని ఏ రేంజ్ లో హైప్ వస్తుందో ఊహించుకోవడం కష్టమే. అసలే గ్లోబల్ స్కేల్ మీద ఇండియానా జోన్స్ తరహాలో వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న రాజమౌళికి ఎంత బడ్జెట్ పెట్టినా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచే రెండు మూడింతలు వచ్చేలా ఉంది.