సుజిత్ ప్లానింగ్ అందుకే స్పెషల్

పవన్ కళ్యాణ్ ఓజి విడుదల తేదీని సెప్టెంబర్ 27గా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఒక కొత్త స్టిల్ తో ఫ్యాన్స్ కి చాలా గ్యాప్ తర్వాత మంచి ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఏపీ ఎన్నికల మీద టిడిపితో కలిసి సీరియస్ గా పని చేస్తున్న పవర్ స్టార్ ఫలితాలు రాగానే ఓజికి డేట్లు ఇచ్చేందుకు పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశాడు. సరిగ్గా నలభై రోజులు ఇస్తే మొత్తం ఫినిష్ చేస్తానని దర్శకుడు సుజిత్ హామీ ఇవ్వడం వల్లే ఇంత క్లారిటీగా అనౌన్స్ మెంట్ ఇచ్చారని తెలిసింది. ఇక్కడ సుజిత్ ప్లానింగ్ చాలా స్పెషలని చెప్పడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ముఖ్యంగా అభిమానుల దృష్టి కోణం నుంచి.

ఓజి ప్రాజెక్టు ప్రకటన దగ్గరి నుంచి టీజర్ కట్ దాకా సుజిత్ తీసుకున్న జాగ్రత్తలు హైప్ కి ఎంతో ఉపయోగపడ్డాయి. దీనికన్నా రెండు సంవత్సరాల ముందు మొదలైన హరిహర వీరమల్లు కన్నా ఓజి కోసమే అభిమానులు ఎదురు చూసేలా బజ్ పెరిగింది. పోస్టర్ల విషయంలో చూపించిన శ్రద్ధ అంచనాలను పెంచేసింది. ఒక వీరాభిమానిగా తాను ఎలా చూపించాలనుకున్నాడో దానికంటే ఎక్కువగానే కనువిందు చేయబోతున్నట్టు ఆల్రెడీ క్లూస్ ఇచ్చాడు. చేతిలో ఏడున్నర నెలల సమయం ఉంది. వీటిలో మూడు నెలలు జనసేన కోసం వదిలేసినా ఇంకో నాలుగు నెలలు టైం ఉంటుంది.

సో సుజిత్ చాలా క్లారిటీతో ఉన్నాడు. ఒక భాగమా లేక సీక్వెల్ ఉంటుందానేది చెప్పలేదు కానీ ఫలితం చూశాక నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఇమ్రాన్ హష్మీ లాంటి క్యాస్టింగ్ క్రేజీగా కనిపిస్తోంది. బ్రో, గుంటూరు కారం విషయంలో అంతగా మెప్పించలేకపోయిన సంగీత దర్శకుడు తమన్ నుంచి ఈసారి బెస్ట్ అవుట్ ఫుట్ ఉంటుందని యూనిట్ ఊరిస్తోంది. ఇప్పటికే షూట్ చేసిన భాగానికి రీ రికార్డింగ్ చేస్తున్నారట. పవన్ సెట్లోకి అడుగు పెట్టాక ఉరుకులు పరుగులు ఉంటుంది కాబట్టి ముందే ప్రిపేరవ్వాలి.