అయిదేళ్ల తర్వాత టైం కలిసి వస్తోంది

టాలీవుడ్ హీరోయిన్ల కొరతని సరైన రీతిలో వాడుకోవాలే కానీ లేట్ అయినా సరే అవకాశాలు వస్తాయి. కాకపోతే ఓపిక పట్టాలి. కావ్య థాపర్ ని ఉదాహరణగా చెప్పొచ్చు. 2018లో ఈ ‘మాయ పేరేమిటో’ ద్వారా పరిచయమైన ఈ ముంబై భామకు డెబ్యూ ఫలితం తీవ్ర నిరాశను మిగిల్చింది. తర్వాత సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ బాగానే పేరు తెచ్చినా అది ఓటిటి రిలీజ్ కావడంతో థియేటర్ ఆడియన్స్ కి అంతగా రీచ్ అవ్వలేదు. తర్వాత తమిళంలో చేసిన ఒకటి రెండు సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ‘బిచ్చగాడు 2’ ఓ మాదిరి హిట్టవ్వడం కలిసొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఆఫర్లు వస్తున్నాయి.

కేవలం వారం రోజుల గ్యాప్ లో కావ్య థాపర్ ఈగల్, ఊరి పేరు భైరవకోన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రాధాన్యం కలిగిన పాత్రలను ఇందులో చేశానని ప్రత్యేకంగా చెబుతోంది. ఇవి కాకుండా నిర్మాణం ఉన్న వాటిలో రామ్ తో పూర్తి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ తనకు పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ‘విశ్వం’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో తనే కథానాయిక. సో రెడీ టు రిలీజ్ రెండు, ప్రొడక్షన్ లో ఉన్నవి రెండు మొత్తం నాలుగు ప్రాజెక్టులతో ఈ ఏడాది లక్కు కలిసి వస్తుందనే నమ్మకంతో ఉంది .

డబుల్ ఇస్మార్ట్ లో తనున్న విషయం టీమ్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ కావ్య థాపరే ఓపెనైపోయింది. మంచి పాత్రలు వస్తున్నాయని, దానికి తగ్గట్టే బ్రేక్ దొరికితే ఇక్కడే సెటిలవ్వొచ్చనే ఆలోచనతో ఉంది. తెలుగు దర్శకులకు హీరోయిన్ల కొరత ఎక్కువైపోయి ఎంతసేపూ శ్రీలీల, రష్మిక మందన్న, మీనాక్షి చౌదరి ఇలా ఇద్దరు ముగ్గురు చుట్టే తిరగాల్సి వస్తోంది. పూజా హెగ్డే ఏమో అసలు కనిపించడమే తగ్గించేసింది. ఇలాంటి టైంలో కావ్య థాపర్ కి ఒకటో రెండో హిట్స్ పడ్డాయంటే దశ తిరిగినట్టే. కాకపోతే ఈగల్, ఊరిపేరు భైరవకోన రెండిట్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండటం గమనార్హం.