ప్రశాంత్ నీల్ ఏం చేయబోతున్నాడు?

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకడు. కేజీఎఫ్ సలార్ సినిమాలతో అతను మామూలు క్రేజ్ సంపాదించలేదు. ప్రశాంత్ దర్శకత్వంలో నటించడానికి పెద్ద పెద్ద స్టార్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇటీవలే సలార్ పార్ట్-1తో పలకరించిన ప్రశాంత్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. నిజానికి అతను సలార్-1 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. కేజీఎఫ్-1 రిలీజ్ అవ్వగానే ప్రశాంత్ ముందుగా సినిమా కమిట్ అయింది తారక్ తోనే. కానీ దానికంటే ముందు సలార్ మొదలై.. పూర్తయింది. రిలీజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా వెంటనే తారక్- ప్రశాంత్ కాంబినేషన్ కార్యరూపం దాల్చేలా లేదు.

ప్రశాంత్ ఖాళీ అయ్యే సమయానికి తారక్ ఫ్రీగా లేడు. దేవరకు సంబంధించి కొంత షూట్, డబ్బింగ్ పనితో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనాల్సి ఉంది. మరోవైపు హిందీ సినిమా వార్-2 చిత్రీకరణకు హాజరు కావాలి. ఇంకో ఏడాది పాటు ఎన్టీఆర్.. ప్రశాంత్ కు అందుబాటులోకి రావడం కష్టమే. ఈ విషయంలో ఇద్దరికీ అండర్ స్టాండింగ్ ఉండడంతో ప్రశాంత్ ఆలోచన కూడా మారిపోయింది.

ముందు అనుకున్నట్లు ఎన్టీఆర్ సినిమా తర్వాత కాకుండా.. ముందే సలార్-2 చేసేయబోపోతున్నాడు. అది రిలీజ్ అయితే ఒక పని అయిపోతుంది. తర్వాత ప్రశాంతంగా ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు ప్రశాంత్. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలు కూడా ప్రశాంత్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రశాంత్ కు కేజీఎఫ్ -3 రూపంలో ఇంకో కమిట్మెంట్ కూడా ఉంది.