బాలీవుడ్ నెపోటిజం, క్రిటిక్స్ పై సందీప్ ఘాటుగా..

తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోనూ అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది నెగిటివ్ రివ్యూలే ఇవ్వగా.. వాళ్లందరి మీద సందీప్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. సందర్భం వచ్చినప్పుడల్లా క్రిటిక్స్ ను ఏకపడేశాడు. తన లేటెస్ట్ మూవీ యానిమల్ రిలీజ్ అయ్యాక కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాను విమర్శించిన బాలీవుడ్ క్రిటిక్స్ కు.. ఇంటర్వ్యూలలో గట్టి కౌంటర్లు ఇచ్చాడు సందీప్.

తాజాగా మరోసారి బాలీవుడ్ క్రిటిక్స్ ను ఘాటుగా విమర్శించాడు సందీప్. బాలీవుడ్ లో చాలామంది దర్శకుల దగ్గర డబ్బులు తీసుకుని పెయిడ్ రివ్యూలు రాస్తుంటారని.. అలాగే వేరే వాళ్ళ సినిమాలను టార్గెట్ చేస్తుంటారని అన్న సందీప్.. యానిమల్ మూవీని కూడా ఇలాగే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించాడు. ఈ సినిమాను మూడు గంటలు టార్చర్ గా అభివర్ణించడం అన్యాయం అని.. ఇలా పేర్కొన్న వాళ్ళు ఎవరు ఈ సినిమా సాధించిన ఓపెనింగ్స్ గురించి.. తమ కష్టం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

యానిమల్ గురించి నెగిటివ్ గా రాసిన, మాట్లాడిన ఎవరికీ సినిమా గురించి అసలు ఏమీ తెలియదని సందీప్ వ్యాఖ్యానించాడు. ఇక బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువే అని.. తమ వాళ్ళ సినిమాలనే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటారని.. అడ్డం వచ్చిన వాళ్ళతో క్రూరంగా వ్యవహరిస్తారని సందీప్ ఆరోపించాడు. బాలీవుడ్లో వివక్ష ఎలా ఉంటుందో అవార్డుల వేడుకల్లో చాలాసార్లు చూశానని.. దాని గురించి మాట్లాడాలంటే రెండు రోజులు పడుతుందని.. కానీ తాను ఈ విషయాల గురించి చిన్న పిల్లాడిలా ఏడవాలనునుకోవడం లేదని సందీప్ అన్నాడు.