హనుమాన్ దెబ్బకు ఊపందుకున్న రామాయణం

బాక్సాఫీస్ వద్ద హనుమాన్ సునామిని చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. పండగ సెలవులయ్యాక అందరి కలెక్షన్లు తగ్గాయి కానీ దీనికి మాత్రం రివర్స్ లో హౌస్ ఫుల్స్ ప్లస్ అదనపు స్క్రీన్లు తోడవుతున్నాయి. మొన్నటిదాకా టికెట్ రేట్లు, మహేష్ బాబు బ్రాండ్ వల్ల ఆధిపత్యం చూపించిన గుంటూరు కారం ఇప్పుడు వెనుకబడిపోయింది. ప్రధాన కేంద్రాల్లో సైతం హనుమాన్ ఫిగర్లే పెద్దగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణంకి హనుమాన్ ఫలితం గొప్ప భరోసా ఇచ్చేసిందని అక్కడి జనాల ఓపెన్ కామెంట్.

రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా మొత్తం మూడు భాగాల్లో తీయాలని నితీష్ ప్లాన్ చేసుకున్నారు. క్యాస్టింగ్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఎంతలేదన్నా అయిదు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని అంటున్నారు. రావణుడిగా నటించేందుకు కెజిఎఫ్ యష్ తో జరుపుతున్న ముంతనాలు ఇంకా కొలిక్కి రాలేదు. అతను టాక్సిక్ లో బిజీ అయిపోయాడు. ఒకవేళ ఒప్పుకున్నా డేట్ల సమస్య వచ్చేలా ఉంది. దీంతో రాఖీ భాయ్ ఈ ప్రాజెక్టులో చేరడం మీద ఇంకా అనుమానాలు తొలగిపోలేదు.

పరిమిత బడ్జెట్ లో మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తోనే హనుమాన్ ఈ స్థాయి విజయం సాధించినప్పుడు సరైన రీతిలో రామాయణాన్ని తీస్తే ఏ స్థాయి ప్రభంజనం ఉంటుందో వేరే చెప్పాలా. ఆదిపురుష్ మీద నెగటివిటీ చూశాక చాలా మంది ఫిలిం మేకర్స్ ఆ ఇతిహాసం జోలికి ఇప్పట్లో వెళ్ళకపోవడం మంచిదననుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ చేసిన రచ్చ ఆ రేంజ్ లో ఉంది మరి. భవిష్యత్తు తరాల పిల్లలు శాశ్వతంగా గొప్పగా చెప్పుకునే రామాయణాన్ని తీస్తానని చెబుతున్న నితీష్ తివారి కుంభకర్ణుడిగా బాబీ డియోల్ ని ట్రై చేస్తున్నారట. క్యాస్టింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.