BMS ఫేక్ రేటింగులపై గుంటూరు కారం సీరియస్

ఉద్దేశపూర్వకంగా గుంటూరు కారంకు బుక్ మై షోలో ఎక్కువ నెగటివ్ రేటింగ్స్ వచ్చేలా ఒక బృందం పని చేసిందని ఫిర్యాదు చేస్తూ నిర్మాతలు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ చిత్రానికి 6.6 రేటింగ్ ఉంది. మాములుగా జనం మొదటి రోజే తిరస్కరించిన డిజాస్టర్లకు సైతం 7 నుంచి 9 మధ్యలో ఉంటుంది. కానీ గుంటూరు కారం అంత దారుణంగా లేదని కలెక్షన్లు తేటతెల్లం చేస్తున్నాయి. మిక్స్డ్ టాక్ ఉన్న మాట వాస్తవమే కానీ మరీ ఫ్యామిలీస్ దూరంగా ఉండే రేంజ్ అయితే కాదు. ఆ మాటకొస్తే యూత్ కన్నా కుటుంబ ప్రేక్షకులే ఎక్కువ వస్తున్నారు.

సుమారు 70 వేలకు పైగా ఇలా బాట్ టెక్నాలజీ వాడి రేటింగ్స్ ఇవ్వడం వల్ల అనవసరమైన నెగటివ్ ప్రాపగండా జరుగుతోందని హారికా హాసిని అభియోగం. నిజానికి ఈ బిఎంఎస్, ఐఎండిబి రేటింగులు దేనికీ ప్రామాణికం కావు. వాటిలో విశ్వసనీయత వెనుక ఎన్నో అనుమానాలున్నాయి. ఆ మధ్య ఇండియన్ టాప్ 250 మూవీస్ లిస్టుని ప్రకటించినప్పుడు అందులో విశ్వనాథ్ గారి క్లాసిక్స్ ఒక్కటీ లేకపోవడం బట్టే చెప్పొచ్చు ఐఎండిబి ఏ పద్ధతి మీద రివ్యూలు చేస్తుందో. ఇప్పుడీ బుక్ మై షో స్కామ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టాల్సిన బాధ్యత సైబర్ క్రైమ్ మీద ఉంది. అంత సులభమైతే కాదు.

ఇలాంటివి కట్టడి చేయడం అవసరమే. భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలకు ఈ సమస్య మళ్ళీ మళ్ళీ తలెత్తే అవకాశం లేకపోలేదు. కొందరు ఈ రేటింగ్స్ చూసి టికెట్లు బుక్ చేసుకునే ట్రెండ్ ని ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఖచ్చితంగా వసూళ్ల మీద ప్రభావం ఉంటుంది. తరచూ యూట్యూబ్ లోనూ ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గుంటూరు కారం టీమ్ కి ఎలాంటి న్యాయం జరుగుతోందో చూసి దాన్ని బట్టి భవిష్యత్తులో మిగిలిన నిర్మాతలు అలెర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి కొత్త తరహా స్కామ్ లు వెలుగు చూస్తూనే ఉన్నాయి.