సంక్రాంతే లక్ష్యంగా శతమానం భవతి 2

ఏడేళ్ల క్రితం 2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణిల మధ్య రిస్క్ తీసుకుని విడుదలైన శతమానం భవతి వాటికి ధీటుగా విజయం సాధించడం ఒక గొప్ప జ్ఞాపకం. జాతీయ అవార్డు రావడం ఇంకో మైలురాయి. దీని గురించి ఇటీవలే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడు వచ్చినా ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆడతాయని నిర్మాత దిల్ రాజు చెప్పిన మాటని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కట్ చేస్తే శతమానం భవతి సీక్వెల్ ని నెక్స్ట్ పేజీ పేరుతో ఎస్విసి సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2025 సంక్రాంతి రిలీజని చెప్పేశారు.

ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని ఇన్ సైడ్ టాక్. మొదటి భాగాన్ని హ్యాండిల్ చేసిన సతీష్ వేగ్నేష ఈసారి సీక్వెల్ బాధ్యతలు తీసుకోకపోవచ్చని వినికిడి. అందుకే వేరే టీమ్ తో దిల్ రాజు స్వయంగా స్క్రిప్ట్ పనులు పర్యవేక్షిస్తున్నట్టు అంతర్గత సమాచారం. డైరెక్టర్ ని ఫైనల్ చేయడానికి ఇంకో నెలా రెండు నెలల సమయం పట్టొచ్చు. ఆలోగా రచయితలు ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేసి అంగీకారం తీసుకున్నాక పూర్తి వివరాలు బయటికి వస్తాయి. క్యాస్టింగ్ మారుతుందా లేక శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లే ఉంటారానేది చూడాలి.

చిరంజీవి విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని దర్శకుడు వశిష్ట చెప్పిన కొన్ని గంటల్లోపే శతమానం భవతి నెక్స్ట్ పేజీ అఫీషియల్ కావడం గమనార్హం. తల్లితండ్రుల ప్రేమ గొప్పదనాన్ని ఎమోషనల్ గా కట్టిపడేసేలా చూపించిన టీమ్ ఈసారి ఏ సెంటిమెంట్ మీద వెళ్తారో చూడాలి. దిల్ రాజు ఈ పండగను మిస్ అయ్యారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని అనుకున్నారు కానీ షూటింగ్ టైంకి పూర్తి కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. దాని స్థానంలో గుంటూరు కారం నైజామ్ హక్కులకు తీసుకుని నిర్మాత తర్వాత అంతా తానై నిలబడి మంచి పంపిణి వచ్చేలా చూసుకున్నారు.