డ్యూటీ చేస్తున్న మహేష్ బాబు స్టామినా

గుంటూరు కారం అంచనాల బరువుని మోసిందా లేదానేది పక్కనపెడితే వసూళ్లు బాగుండటం అభిమానులకు రిలీఫ్ ఇస్తోంది. నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం చూస్తే  రెండు రోజులకు 127 కోట్ల గ్రాస్, అది కూడా ప్యాన్ ఇండియా భాషల్లో డబ్బింగ్ కాని ఒక రీజనల్ మూవీకి చాలా భారీ మొత్తం. ఇది పూర్తిగా మహేష్ బాబు స్టామినా. ఎందుకంటే మాములుగా ఈ స్థాయిలో డివైడ్ టాక్ వచ్చినవి రెండో రోజే నెమ్మదిస్తాయి. ఎంత సంక్రాంతి అయినా సరే బాక్సాఫీస్ లెక్క తగ్గుతుంది. కానీ మహేష్ దానికి భిన్నంగా జనాన్ని రాబడుతున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు.

ఇక్కడ జనం టాక్ ఎలా ఉంది అనే దానికంటే హాలిడే కాబట్టి మహేష్ బాబు మరీ నిరాశ పరచడనే అభిప్రాయంలో ముందే ఉంటున్నారు. తనే నటించిన బ్రహ్మోత్సవం, త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గానే ఉందనే పాయింట్ కుటుంబ ప్రేక్షకులను వచ్చేలా చేస్తోంది. గుంటూరు కారం కన్నా హనుమాన్ వేవ్ ఎక్కువగా ఉన్న మాట అబద్దం కాదు. బుక్ మై షోలో సాక్ష్యం రూపంలో కనిపిస్తోంది. అలా అని దానితో పోల్చడం ఎంత మాత్రం సబబు కాదు. ఎందుకంటే పబ్లిక్ హనుమాన్ కి ఓటేస్తోంది తేజ సజ్జను చూసి కాదు. ఎమోషన్ తో కనెక్ట్ చేసిన డివోషనల్ కంటెంట్ వల్ల.

మొన్న దిల్ రాజు చెప్పినట్టు ఇంకో నాలుగైదు రోజులు ఆగితే గుంటూరు కారం హిట్టా లేక ఫ్లాపా తేలిపోతుంది. బ్రేక్ ఈవెన్ అవ్వడం అంత సులభంగా లేకపోయినా ఇంకో వారం పది రోజుల దాకా చెప్పుకోదగ్గ రిలీజ్ ఏది లేదు. ఒకవేళ కెప్టెన్ మిల్లర్, ఆయలాన్ డబ్బింగ్ వెర్షన్లలో ఏదో ఒకటి వచ్చినా ఇబ్బందేమీ లేదు. నా సామిరంగకు డీసెంట్ టాక్ కొనసాగితే గుంటూరు కారం రెవిన్యూలో ఇంకొంత కోత తప్పదు.  సైంధవ్ తో ఎలాంటి థ్రెట్ లేదని అర్థమైపోయింది. ఏది ఏమైనా మహేష్ రేంజ్ కి ఇదో కొలమానం. టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని ఫుల్ చేయడం అంత సులభం కాదు.