హనుమంతుడు నెరవేర్చిన ప్రశాంత శపథం

విడుదలకు ముందు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఏవేవో మాటలు. థియేటర్ల పంపకాల్లో తేడా వస్తోందనే వార్తలు తిరిగినప్పుడు నిర్మాత మీదా ఇవే అభాండాలు. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో సినిమానే మమ్మల్ని నడిపిస్తుందని, థియేటర్లు వాటంతటవే పెరుగుతాయని, ఖచ్చితంగా గెలిచి తీరతామని దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన శపథం నెరవేరుతోంది. ప్రీమియర్ల నుంచి వచ్చిన అద్భుత స్పందన ఫస్ట్ డే కలెక్షన్ కు అమాంతం దోహదపడింది. తెలంగాణలో ఎక్కువ కాదు కానీ ఏపీలో షోలు, స్క్రీన్లు ఒక్కసారిగా పెరగడం మొదలయ్యాయి. సలార్ ని రీప్లేస్ చేసి మరీ హనుమాన్ కి ఇస్తున్నారు.

బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే హనుమాన్ సగటు బుకింగ్స్ గంటలు 18 వేల టికెట్ల దాకా ఉండగా గుంటూరు కారం హఠాత్తుగా నెమ్మదించి 12 వేల దగ్గర నడుస్తోంది. ఇది షాకే. టాక్ ప్రభావం చూపించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ నైజామ్ లో ఇంకా ఎక్కువ స్క్రీన్లు దొరికి ఉంటే హనుమాన్ రచ్చ ఇంకో స్థాయిలో ఉండేదని బయ్యర్ల కామెంట్. ఇందులో నిజముంది. ఇంకో పక్క ఉత్తరాది రాష్ట్రాల్లో మెల్లగా మొదలైన ఊపు క్రమంగా పెరుగుతోంది. హిందీ స్ట్రెయిట్ రిలీజ్ అయిన మెర్రీ క్రిస్మస్ కంటే హనుమాన్ ని చూసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నట్టు గ్రాఫ్ పెరుగుదల సూచిస్తోంది.

సంక్రాంతి రేసులో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి స్టేటస్ తేలాకే హనుమాన్ దూకుడు ఏ స్థాయిలో పెరుగుతుందనేది డిసైడ్ అవుతుంది. తేజ సజ్జ లాంటి అప్ కమింగ్ హీరోకి ఇది అనూహ్యమైన ఓపెనింగే. మహేష్ బాబు సునామి ముందు నిలవగలడా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ హనుమంతుడి అండతో తట్టుకోవడం ఇప్పటికిప్పుడు స్టార్ డం తీసుకురాదు కానీ పెద్ద బ్యానర్లు, బడా ప్రొడ్యూసర్లు దగ్గరికొచ్చేలా చేస్తుంది. ఇక ప్రశాంత్ వర్మ సంగతి చెప్పనక్కర్లేదు. జై హనుమాన్ తో పాటు మొత్తం 12 చిత్రాలతో ప్లాన్ చేసుకున్న సినిమాటిక్ యునివర్స్ కి రూట్ క్లియర్ అయినట్టే.