తెలుగోళ్ల సినిమా ప్రేమకు థియేటర్లు ఫుల్

టాకులు, రివ్యూల సంగతి కాసేపు పక్కనపెడితే నిన్న సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల థియేటర్లు జనంతో నిండుగా కళకళలాడిపోతున్నాయి. హనుమాన్ ప్రీమియర్లకు ఊహించని భారీ స్పందన దక్కడంతో పాటు ఆడియన్స్ టాక్ చాలా పాజిటివ్ గా ఉండటంతో ఇవాళ్టి నుంచి బొమ్మ బుక్ మై షో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. గంటకు పదహారు వేలకు పైగా టికెట్లు అమ్ముతూ తక్కువ స్క్రీన్లు ఉన్నప్పటికీ దూసుకుపోతోంది. ఇక అర్ధరాత్రి నుంచి హంగామా షురూ చేసిన గుంటూరు కారంది నెక్స్ట్ లెవెల్ సందడి. బెనిఫిట్ షోలతో మొదలుపెట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయి.

స్కూళ్ళు కాలేజీలకు మొన్నటి నుంచి సెలవులు మొదలైపోవడంతో టైం పాస్ కోసం ఫస్ట్ ఆప్షన్ గా పబ్లిక్ సినిమాలనే ఎంచుకుంటున్నారు. దానికి తగ్గట్టే హనుమంతుడు, మహేష్ బాబు ఇద్దరూ గట్టిగా టికెట్లు తెంపుతున్నారు. రేపు సైంధవ్, ఎల్లుండి నా సామిరంగల ఎంట్రీతో ఇది నెక్స్ట్ లెవెల్ కు వెళ్లబోతోంది. ఈసారి నైజామ్ కు ధీటుగా అన్ని సినిమాల వసూళ్లు ఏపీలోనూ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి లక్షలాది జనాలు పండక్కు స్వంత ఊళ్లకు వెళ్లడంతో సహజంగానే బీసీ సెంటర్లలో పెద్ద నెంబర్లు నమోదవుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల వైపు భారీ రికార్డులు పడతాయి.

బాలీవుడ్ లో మెర్రీ క్రిస్మస్, తమిళంలో అయలాన్ – కెప్టెన్ మిల్లర్ లు ఉన్నప్పటికీ వాటికి మన స్థాయిలో ఆదరణ, ఓపెనింగ్స్ ఆయా రాష్ట్రాల్లో కనిపించడం లేదు. దీన్ని బట్టే తెలుగోళ్ల ప్రేమ సినిమా మీద ఎంత ఉందో అర్థమవుతుంది. హనుమాన్ పాజిటివ్, గుంటూరు కారం డివైడ్ టాక్ తో మొదలవ్వగా, సైంధవ్, నా సామిరంగలు కనక మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మరిన్ని థియేటర్లు వీటికి సహకరిస్తాయి. ఇప్పటికే హనుమాన్ కు శనివారం నుంచి భారీ సంఖ్యలో షోలు పడతాయని ట్రేడ్ టాక్. ఈ నెల 20 దాకా నాలుగు సినిమాలకు పండగ వసూళ్లు చాలా కీలకం కాబోతున్నాయి.