బుకింగ్స్ మడత పెట్టేస్తున్న వెంకటరమణ

గుంటూరు కారం బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను నివ్వెరపరుస్తున్నాయి. ముఖ్యంగా నైజామ్ లో టికెట్ రేట్లు సలార్, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో భారీగా పెంచినా సరే వెంకటరవణగా మహేష్ బాబుని చూసేందుకు ఎగబడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ చరిత్రలోనే అత్యధికంగా 41 షోలు వేస్తే అన్ని ఫుల్లయిపోవడం చూసి ఫ్యాన్స్ కి నోట మాట రావడం లేదు. ఏఎంబిలో ఏకంగా 42 షోలు పెడితే హౌస్ ఫుల్ అయ్యేందుకు కేవలం నిముషాలు పడుతోంది. సుదర్శన్, దేవి సింగల్ స్క్రీన్లు మొదటి రోజు ఆన్ లైన్ లో పెట్టేందుకు వీల్లేనంత ఒత్తిడిలో ఉన్నాయట.

ఆన్ లైన ఛార్జ్ తో కలిపి ఒక మల్టీప్లెక్స్ టికెట్ 450 రూపాయలు పెట్టినా సరే అభిమానుల ప్రేమ ముందు అది చిన్నదైపోయింది. ఇక్కడే కాదు ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉందని బయ్యర్లు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో యాభై రూపాయల పెంపుతో ఏ క్షణమైనా జిఓ వచ్చేలా ఉంది. అర్ధరాత్రి షోలకు సంబంధించిన క్లారిటీ సాయంత్రం లేదా రాత్రి లోపు ఇవ్వబోతున్నారు. ఇక మిడ్ నైట్ షోల రేట్లు అనధికారికంగా రెండు వేల రూపాయల పైబడే ఉన్నాయట. కూకట్ పల్లిలోని ఒక సింగల్ స్క్రీన్ బెనిఫిట్ షోని ఏకంగా పదమూడు లక్షలకు పాడుకున్నారనే ఫ్యాన్ టాక్ వైరల్ అవుతోంది.

ఈ లెక్కన నిర్మాత నాగవంశీ చెప్పినట్టు నాన్ రాజమౌళి రికార్డులన్నీ గుంటూరు కారం ఖాతాలో పడతాయని అభిమానుల కామెంట్. అఫ్కోర్స్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమి అసాధ్యం కాదు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ ని చూసి చాలా గ్యాప్ వచ్చేసింది. పైగా పోకిరిని మించిన మాస్ ఇందులో చూస్తారని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు అన్న మాటలు అంచనాలను మరింత పెంచాయి. గుంటూరు కారం ప్రభావం ముందే ఊహించి హనుమాన్ జనవరి 11 ప్రీమియర్లకు వెళ్లిపోవడం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఆన్ లైన్ లో ఎక్కడ చూసినా మహేష్ జపమే కనిపిస్తోంది.