క్రేజీ కాంబోని పట్టించుకునేంత సీన్ లేదు

జనవరి 12 మొదలుకాబోతున్న సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధంలో నాలుగు సినిమాలు నువ్వా నేనాని తలపడుతున్నాయి. ముగ్గురు పెద్ద హీరోలు, ఒక భారీ ఫాంటసీ మూవీ దేనికవే అంచనాలు భారీ ఎత్తున మోస్తున్నాయి. ఈగల్ తప్పుకోవడం ఊరట కలిగించింది కానీ లేదంటే పరిస్థితి ఇంకెంత టైట్ గా ఉండేదో ఊహించుకోవడం కష్టమే. అందుకే ఈసారి డబ్బింగ్ చిత్రాలకు చోటు లేకుండా పోయింది. అంతో ఇంతో మార్కెట్ ఉన్నప్పటికీ అయలాన్, కెప్టెన్ మిల్లర్ తెలుగు రాష్ట్రాల్లో వాయిదా పడటంతో ధనుష్, శివ కార్తికేయన్ లకు ఈసారి ఫెస్టివల్ కి నో ఎంట్రీ బోర్డు పడిపోయింది.

వీటి సంగతలా ఉంచితే ఈ హడావిడిలో ఇంకో చెప్పుకోదగ్గ మూవీ బరిలో ఉంది. అదే మెర్రీ క్రిస్మస్. విజయ్ సేతుపతి – కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా అందాదున్ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్లాసిక్ ఇచ్చిన శ్రీరామ్ రాఘవన్ దీనికి దర్శకుడు. దీని రిలీజ్ డేట్ కూడా జనవరి 12. నిన్న సాయంత్రం తెలుగు ట్రైలర్ లో ఇదే తేదీని స్పష్టం చేశారు కానీ రియాలిటీలో వచ్చే సూచనలు తక్కువే. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాల్లోనూ దీని బుకింగ్స్ కనిపించడం లేదంటే రావడం లేదనే అర్థం. తెలుగు హక్కులు ఎవరు కొన్నారో ఇంకా స్పష్టత లేకపోయినా ఆన్ లైన్ ప్రమోషన్లు జరుగుతున్నాయి.

డంకీ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా లేక బాలీవుడ్ డల్ గా ఉంది. ఈ అవకాశాన్ని వాడుకోవాలని మెర్రీ క్రిస్మస్ టీమ్ ఎదురు చూస్తోంది. తమిళ, తెలుగులో ఉన్న కాంపిటీషన్ దెబ్బకు థియేటర్లు దొరక్కపోయినా సరే నార్త్ ని టార్గెట్ చేసుకుంది. అయితే హనుమాన్ రూపంలో ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురు చూస్తోంది. ఒకవేళ హనుమాన్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అయోధ్య రామాలయం సెంటిమెంట్ దేశమంతా ఉన్న టైంలో టైటిల్ లోనే క్రిస్మస్ ని పెట్టుకున్న సేతుపతి సినిమాకు ఇబ్బంది తప్పదు. తక్కువ బడ్జెట్ కాబట్టి బిజినెస్ కూడా రీజనబుల్ గానే జరిగింది.