రజనీ కమల్ హాజరైన డిజాస్టర్ వేడుక

మాములుగా ఫంక్షన్ ఏదైనా స్టార్ హీరోలు వస్తున్నారంటే జనం తండోపతండాలుగా రావడం సహజం. వాళ్ళ దాకా ఎందుకు ఒక మోస్తరు టీవీ యాంకర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లకి వెళ్లినా ఆ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు ఒక పబ్లిక్ ఈవెంట్ కి వస్తే ఎలా ఉండాలి. కానీ విచిత్రంగా నిన్న జరిగిన కరుణానిధి శతజయంతి ఉత్సవం కలైనర్ 100 సందర్భంగా వచ్చిన పబ్లిక్ ని చూసి నిర్వాహకులు సిగ్గుతో చితికిపోయారు. 50 వేల కుర్చీలు వేస్తే పట్టుమని వెయ్యి మంది కూడా చివరి దాకా కూర్చోలేనంత ఘోరంగా ఫ్లాపయ్యింది.

ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేస్తే ఇంత దారుణంగా తిరస్కారానికి గురి కావడం స్టాలిన్ సర్కార్ జీర్ణించుకోలేక పోతోంది. కమల్ రజనిలే కాదు సూర్య, కార్తీ, ధనుష్, శివ కార్తికేయన్. శివ రాజ్ కుమార్, నయనతార, కీర్తి సురేష్, వడివేలు, జీవా, జయం రవి, పార్తిబన్ ఇలా ఎందరో సెలబ్రిటీలు వచ్చారు. అయినా సరే ఇంత పల్చగా అటెండెన్స్ హాజరు కావడం చూసి పోలీస్ డిపార్ట్ మెంట్ సైతం నివ్వెరపోయింది. రద్దీని నియంత్రించలేమనే ఉద్దేశంతో అదనపు బలగాలను తీసుకొస్తే వాళ్లకు భోజన రవాణా ఖర్చులు తప్ప ఏమీ లేదు. పైగా టన్నుల కొద్దీ ఫుడ్డు మిగిలిపోయింది.

విజయ్, అజిత్ లు రాకపోవడంతో వాళ్ళ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వేదిక దగ్గర వందల కుర్చీలు ఖాళీగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఎనలేని కళాసేవ చేసిన ఒక దిగ్గజ కవి, మాజీ ముఖ్యమంత్రికి దక్కాల్సిన గౌరవం ఇది కాదని డీఎంకే ఫాలోయర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురించి కాకపోయినా కనీసం కోలీవుడ్ స్టార్లందరూ ఒకేచోట కలుస్తున్నారన్న ఆసక్తి కూడా లేకుండా జనాలు దూరంగా ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని పలువురు విశ్లేషకులు ఎపిక్ డిజాస్టర్ గా పేర్కొంటున్నారు.